హైదరాబాద్ కు కూతవేటు దూరంలోని మహబూబ్ నగర్ జిల్లా, షాద్ నగర్ లో చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో గ్యాంగ్ స్టర్ నయీమ్ హతమయ్యాడు. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన నయీమ్ నేర చరిత్ర చిట్టా భారీ స్థాయిలోదే. ముఖ్యంగా సంచలన వ్యాప్తంగా నిలిచిన సీనియర్ ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య కేసులో నయీమ్ కీలక నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ కేసుతో పాటు పటోళ్ల గోదర్ధన్ రెడ్డి, మావోయిస్టు నేతలు సాంబశివుడు, రాములు హత్య కేసుల్లోనూ నయీమ్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. అలాగే భూదందాలు, సెటిల్ మెంట్లకైతే కొదవలేదు. తనదైన శైలిలో కరడుగట్టిన నేరగాడిగా పేరు గాంచిన నయీమ్, షాద్ నగర్ లోని మిలీనియం టౌన్ షిప్ లోని ఓ ఇంట్లో పై దృష్టి సారించిన తెలంగాణ సర్కారు, అతడ్ని వేటాడేందుకు పోలీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ముందుగా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దాగున్నారన్న సమాచారం రావడంతో, సదరు ప్రాంతం మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు, బీఎస్ఎఫ్ జవాన్లు, బాషా అనే వ్యక్తి ఇంటిని చుట్టుముట్టారు. పోలీసులు వచ్చారన్న అనుమానంతో ఆ ఇంటి నుంచి కాల్పులు రావడంతో, ఎదురు కాల్పులు జరిపిన పోలీసుల తూటాలకు నయీమ్ అంతమొందాడు. మొత్తం 20 హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న నయీమ్ పై, 100కు పైగా పెండింగ్ కేసులున్నాయి.