Telangana-Rashtra-Samoohika-Jateeya-Geethaalapana-భారత్‌ వజ్రోత్సవాలలో భాగంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో ఓ అపురూపమైన దృశ్యం సాక్షాత్కరించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు ఈరోజు ఉదయం 11.30 గంటలకు జనగణమన జాతీయగీతాలపన చేశారు. రాజధాని హైదరాబాద్‌లో మెట్రో రైళ్ళతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11.30 గంటలకు ఎక్కడి వాహనాలు అక్కడ నిలిపివేసి జాతీయగీతాన్ని పాడారు. ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సిఎం కేసీఆర్‌, హైదరాబాద్‌లో అబీడ్స్ జంక్షన్ వద్ద గల నెహ్రూ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై తన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి జాతీయగీతాలాపన చేశారు.

సిఎం కేసీఆర్‌ పిలుపు మేరకు యావత్ తెలంగాణ రాష్ట్రం జనగణమన గీతం ఆలపిస్తుంటే, ఆ దృశ్యం కళ్ళారా చూసి, చెవులారా విని ఆందించాల్సిందే తప్ప మాటలలో వర్ణించలేము. ఈ కార్యక్రమం కోసం ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఏర్పాట్లు చేసుకొన్నారు.

ఉదయం 11.30 గంటలకు తెలంగాణ రాష్ట్రమంతటా ట్రాఫిక్ సిగ్నల్స్ రెడ్ పడ్డాయి. మెట్రో రైళ్ళు, బస్సులు, కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్ (మైకు)లలో ముందుగా సైరన్ మ్రోగించారు. అది నిలిచిపోగానే కోట్లాదిమంది తెలంగాణ ప్రజలందరూ ఒకే గొంతుగా జనగణమన ఆలపించారు.

రాష్ట్రాన్ని, ప్రజలను సరైన మార్గంలో నడిపించగలవాడే నాయకుడు అనిపించుకొంటాడు. అటువంటి నాయకుడే తెలంగాణ సిఎం కేసీఆర్‌. ఆయన ఎన్నడూ ఊక దంపుడు ఉపన్యాసాలు చేయరు. అందుకే ఆయన మాటకు అంత విలువ ఉంటుంది.

ఇటీవల హైదరాబాద్‌లో వజ్రోత్సవాల వేడుకలను ప్రారంభిస్తూ, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన జాతీయ నాయకులు ఏవిదంగా దేశాభివృద్ధికి ప్రణాళికలు రచించి అమలుచేశారు… ఆ ప్రయత్నంలో ఎవరెవరూ పాల్గొన్నారు? వారి ప్రయత్నాలతో దేశంలో ఎటువంటి మార్పులు వచ్చాయో అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చాలా చక్కగా వివరించారు. అలాగే భారత్‌కు 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలో గల వందలాది సంస్థానాలను భారత్‌లో విలీనం చేసేందుకు ఎంతమంది నాయకులు, ఏవిదంగా కృషి చేశారో సిఎం కేసీఆర్‌ చాలా చక్కగా వివరించారు.

రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ మన దేశ చరిత్ర, స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాలు తెలుసుకొని భావితరాలకు కూడా తెలియజేయాలని సిఎం కేసీఆర్‌ సూచించారు. ఈ సందర్భంగానే రాష్ట్ర ప్రజలలో దేశభక్తిభావం ఇనుమడించేందుకు ఈరోజు జాతీయగీతాలాపన చేయాలని పిలుపునిచ్చారు. దానిని తెలంగాణ ప్రజలు తూచా తప్పకుండా పాటించారు కూడా.

నిజానికి సిఎం కేసీఆర్‌ ప్రజలకు చరిత్ర పాఠాలు చెప్పవలసిన అవసరం లేదు. ఇవన్నీ చేయవలసిన అవసరం కూడా లేదు. కానీ కేసీఆర్‌ ఓ సమర్దుడైన నాయకుడు కనుకనే కేవలం ఊకదంపుడు ప్రసంగం చేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోకుండా రాష్ట్ర ప్రజలందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చి వారిని దేశభక్తిభావంతో పులకింపజేశారు.

అదే… మన రాష్ట్రంలో మహా నాయకుడు సొంత డప్పు కొట్టుకోవడానికే పరిమితమయ్యారు. వ్రాసి ఇచ్చిన ప్రసంగాన్ని సరిగ్గా చదవలేక తడబడుతూ తెలుగు పదాలను చిత్రవధ చేసేశారు. పక్కపక్కనే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల అధినేతల తీరులో ఎంత తేడా ఉందో ఇది కళ్ళకు కట్టినట్లు చూపుతోంది.