కరోనా విజృంభణ నేపథ్యంలో దేశంలో ప్రస్తుతం ఏప్రిల్14 వరకు 21 రోజుల లాక్డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే రోజురోజుకి కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ను ఏప్రిల్ 30 వరకు కొనసాగించాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దీంతో దేశంలో లాక్డౌన్ను పొడగించిన మొదటి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. అలాగే రాష్ట్రంలోని పాఠశాలు జూన్ 17వరకూ మూసివెయ్యబడతాయి. లాక్డౌన్ గురించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పరిస్థితులలో మరిన్ని రాష్ట్రాలు ఒడిశాని అనుసరిస్తాయని భావిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే లొక్డౌన్ ని పొడిగించాలని ప్రధానిని కోరారు.
లేని పక్షంలో తెలంగాణ కూడా సొంతంగా లొక్డౌన్ ని పొడిగించే అవకాశం ఉంది. మరోవైపు లొక్డౌన్ కొనసాగింపు పై ఉత్తరప్రదేశ్ సర్కార్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. కరోనాను పూర్తిగా కట్టడి చేశాకే లాక్డౌన్ ఎత్తివేసే అవకాశం ఉందంటూ ప్రభుత్వ ముఖ్య అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇక రాజస్తాన్ కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది.
నిన్న రాత్రి విడుదల చేసిన మెడికల్ బులెటిన్ ప్రకారం తెలంగాణలో 453 కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజే 49 కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదు కావడంతో హైదరాబాద్ నగరంలోని 15 ప్రాంతాలను అష్టదిగ్బంధనం చేశారు. రాకపోకలు నిలిపివేసి ఇంటింటికి వెళ్లి అనుమానితుల గురించి సర్వే చేస్తున్నారు.