తెలంగాణ సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య వచ్చే ఎన్నికలలో ఏపీ నుండి పోటీ చెయ్యడానికి సిద్ధం అవుతున్నారట. ఆయన ఈ మేరకు సిపిఎం కమిటీకి దరఖాస్తు చేసుకుని వారి అంగీకారం కోసం వేచి చూస్తున్నారు. భద్రాచలం నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న రాజయ్య ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఉన్నారు.
2014 ఎన్నికలు అయిన వెంటనే పోలవరం ప్రాజెక్టు అవసరాల కోసం ఏడు మండలాలను ఎపిలో విలీనం చేశారు. వాటిలో ఒకటి అయిన వి.ఆర్.పురం మండలం లోనే రాజయ్య స్వగ్రామం సున్నంవారి గూడెం ఉంది. దాంతో రాజయ్య వచ్చే ఎన్నికలలో ఆయన రంపచోడవరం నుంచి పోటీచేయాలని ఆసక్తిగా ఉన్నారు.
కాగా ఆయన బదులుగా తెలంగాణలో ఉన్న భద్రాచలం నుంచి పోటీచేయడానికి మాజీ ఎమ్.పి ,సిపిఎం నేత మిడియం బాబూరావు ఆసక్తిగా ఉన్నారు. జనసేనతో పొత్తు కారణంగా తెలంగాణాలో కంటే ఏపీలో సీపీఎం బలంగా ఉందని రాజయ్య భావిస్తున్నారట. కాబట్టి పవన్ కళ్యాణ్ మద్దతుతో ఏపీలో పోటీ చేస్తే గెలవడం తేలిక అని ఆయన భావిస్తున్నారట.