Telangana minister CH Malla Reddy phone conversation viralమునిసిపల్ ఎన్నికల ముంగిట తెలంగాణ రాష్ట్ర సమితిలో కొత్త లొల్లి మొదలయ్యింది. బోడుప్పల్‌కు చెందిన టీఆర్ఎస్ నేత రాపోలు రాములుతో మల్లారెడ్డి మాట్లాడిన ఫోన్ ఆడియో సోషల్ మీడియాలో ఆడియో తెగ వైరల్ అవుతోంది. ఆ ఆడియో ఇప్పుడు అధికార పార్టీని ఇబ్బంది పెట్టేలా ఉండటం నేతలకు చికాకు కలిగిస్తుంది.

టికెట్ల కోసం డబ్బులు అడిగిన సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయంటూ మంత్రి మల్లారెడ్డితో రాపోలు రాములు మాట్లాడినట్టుగా ఆ ఆడియోలో ఉంది. నీ వ్యవహారమంతా టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర రెడ్డికి చెప్తానని ఆయన మల్లారెడ్డిని హెచ్చరించారు. రేపో .ఎల్లుండో పల్లా రాజేశ్వర రెడ్డి వద్దకు వెళ్తానని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కూడా మల్లారెడ్డి చెప్తానని రాపోలు రాములు మల్లారెడ్డితో చెప్పారు. చెప్పు..పో అంటూ మల్లారెడ్డి ఆయనకు జవాబిచ్చారు. ఈ ఫోన్ కాల్ వ్యవహారం టీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. రాష్ట్ర కేబినెట్లోకి మల్లారెడ్డిని తీసుకున్న నాటి నుండీ ఆయనను వివాదాలు చుట్టుముడుతూనే ఉంటున్నాయి. కొన్ని రోజుల క్రితం మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో స్టేజి మీద మల్లారెడ్డి గొడవపడ్డారు. ఇది ఇలా ఉండగా మంత్రి వైఖరిపై ఇప్పటికే ఫిర్జాదిగూడకు చెందిన కొందరు టీఆర్ఎస్ నేతలు పార్టీ మారారు కూడా.

తిరిగి బుజ్జగింజడంతో సొంత గూటికి చేరుకున్నారు. మున్సిపల్ ఎన్నికలపై జరిగిన సమావేశంలో మల్లారెడ్డి తీరుపై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. వచ్చే కేబినెట్ విస్తరణలో ఆయనను తప్పించే అవకాశం ఉందని తెరాస నేతలలో గట్టిగా ప్రచారం జరుగుతుంది.