మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత మరోసారి రాజకీయంగా యాక్టీవ్ కాబోతున్నారు. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఆమె నిజామాబాదు సిట్టింగ్ స్థానం నుండి ఓటమి చెందారు. అప్పుటి నుండి రాజకీయాలలో పెద్దగా యాక్టీవ్ గా లేరు. రాజ్యసభ ఎంపీగా కవితకు అవకాశం దక్కుతుందన్న ఊహాగానాలు సాగినప్పటికీ కేసీఆర్ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు.
తాజాగా తాను ఓడిన నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా కవితను బరిలోకి దించారు. ఈరోజు ఆమె నామినేషన్ కూడా వెయ్యబోతున్నారు. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠం నుండి తప్పుకొని కేటీఆర్కు పగ్గాలు అప్పజెప్పనున్నారన్న ప్రచారం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత పట్టాభిషేకం ఉండవచ్చని అంటున్నారు.
ఈ క్రమంలో కవితని కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. దానితో పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కేటీఆర్, ఆ తర్వాత స్థానం కవితలకే ఉండేలా సీఎం కేసీఆర్ వ్యూహా రచన చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల కింద మొత్తం 824ఓట్లు ఉండగా… టీఆర్ఎస్కు 592, బీజేపీ 90, కాంగ్రెస్కు 142మంది ఉన్నారు.
దీనితో కవిత గెలుపు లాంఛనం కావొచ్చు. అయితే రాజ్యసభ ఎంపీ డి. శ్రీనివాస్, బీజేపీ ఎంపీ అరవింద్ కవితను నిలువరించి… నిజామాబాద్పై తమ పట్టును నిలుపుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. గతంలో తెరాస నుండి ఎమ్మెల్సీ అయిన భూపతి రెడ్డి కాంగ్రెస్లో చేరటం ద్వారా ఉప ఎన్నిక వచ్చింది.