ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో పిచ్చి ఉంటుందని, తమ పార్టీకి కూడా ఒక పిచ్చి ఉందని తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తమది ప్రజల పార్టీ అని, ఉద్యమ పార్టీ అని తెలంగాణ ప్రజల సంక్షేమమే తమ పార్టీ పిచ్చిగా కేసీఆర్ అభివర్ణించారు. ఉద్యమ సమయంలో ఎంతో మంది నేతలు ప్రత్యేక రాష్ట్రం ఎందుకని అన్నారని, అయితే తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగాలనే తాము పోరాడామని గుర్తు చేసుకున్నారు.
తెలంగాణలో రిజర్వేషన్లపై తాము చేస్తోన్న కృషిని పలువురు విమర్శిస్తున్నారని, 50 శాతం దాటకుండా రిజర్వేషన్లు ఉండాలని రాజ్యాంగంలో లేదని, అయితే ఇందిరా సహాని పిటిషన్ పై మాత్రమే 50 శాతం దాటి ఉండరాదని సుప్రీంకోర్టు చెప్పిందని, ప్రత్యేక పరిస్థితి ఉంటే రిజర్వేషన్లు 50 శాతం దాటవచ్చని సుప్రీంకోర్టు చెప్పినట్లుగా కేసీఆర్ తెలిపారు. 1980లో తమిళనాడులో 68 శాతం రిజర్వేషన్లకు శ్రీకారం చుట్టారని, 1990లో తమిళనాడులో ఎస్టీలకు ఒక శాతం పెంచి అమలు చేశారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో తాము ఏ పార్టీ పొత్తు లేకుండా గెలిచామని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వెళుతున్నామని, తమిళనాడులో కొనసాగుతున్న రిజర్వేషన్ల మాదిరిగానే తాము రిజర్వేషన్లు తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ముఖాల్లో చిరునవ్వు చిందితేనే నిజమైన తెలంగాణ వచ్చినట్లని, ఆ దిశగానే తమ ప్రభుత్వం కృషి చేస్తూ ముందుకు వెళుతుందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఒక చరిత్రైతే, రైతు రుణమాఫీ దశల వారీగా చేసుకుంటూ వస్తుండడంతో మరో చరిత్రగా చెప్పారు.
తాము ముందుగా చెప్పిందే చేస్తున్నామని, కొత్తగా ఏమీ చేయడం లేదని, రాజకీయ పార్టీలు మానిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలు అమలు పర్చాలని ఇటీవల మోడీ సమక్షంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్నారని, అందుకోసం కఠిన చట్టం కూడా తీసుకురావాలని అన్నారని, తాము అదే విధంగా మేనిఫెస్టోలో చెప్పిందే చేస్తున్నామని అన్నారు. ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ ప్రజల మన్ననలను అందుకుంటుందని, నీతి అయోగ్ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు కేసీఆర్.