రేపటి జనతా కర్ఫ్యూ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగత బాధ్యతతో కరోనా కట్టడీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రజలంతా సహకరించాలని ఆయన అన్నారు.
700 మందికి పైగా కరోనా అనుమానితులకు పరీక్షలు చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. “పరిస్థితి చెయ్యి దాటి పోతే అవసరమైతే రాష్ట్రాన్ని మొత్తంగా మూసివేసే ఆలోచన కూడా ఉంది,” అని కేసీఆర్ చెప్పారు.
“అటువంటి పరిస్థితిలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సరుకులు రేషన్ గా సప్లై చెయ్యడానికి ఆలోచనలు చేస్తున్నాం. అందుకు కావాల్సిన మనుషులు, వాహనాల గురించి కూడా ఇప్పటికే డిస్కస్ చేశాం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. అందరు జాగ్రత్తగా ఉండండి. రేపు ఒక్క రోజు బయటకు రాకండి. తెలంగాణ ఈ విషయంలో దేశానికే ఆదర్శంగా అవ్వాలి,” అని చెప్పారు.
ప్రధాని మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ రేపు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం తొమ్మిది గంటల వరకే అయినా, తెలంగాణలో మాత్రం ఆ రోజు ఆరు గంటల నుండి 23వ తారీఖు ఉదయం ఆరు గంటల వరకూ జనతా కర్ఫ్యూ ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.