తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఇటీవల హైదరాబాద్లో జరిగిన క్రెడాయ్ సమావేశంలో ఏపీలో రోడ్లు, నీళ్ళు, విద్యుత్ కోతల గురించి కామెంట్స్ చేయడం, దానిపై ఓ రెండు రోజులు ఏపీ, తెలంగాణ మంత్రులు పరస్పరం బాణాలు వేసుకోవడం అందరూ చూశారు.
సాధారణంగా మంత్రి కేటీఆర్ ఎన్నడూ ఆవిదంగా నోరు జారరు. చాలా ఆచితూచి మాట్లాడుతుంటారు. ముఖ్యంగా ఏపీ జోలికి అసలే రారు. కానీ ఆ రోజు ఏపీ పరిస్థితి దయనీయంగా ఉందని చటుక్కున అనేశారు. దాంతో మొదలైన గొడవను పక్కన పెడితే, ఆయనకు చాలా మంది ఏపీ మిత్రులు ఉన్నప్పుడు అసలు ఆ మాట ఎందుకు అన్నారనే సందేహాలు వ్యక్తం అయ్యాయి.
దానికి ఆయన స్నేహితులే కారణమని తెలుస్తోంది. సిఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల కావచ్చు లేదా టిడిపి సోషల్ మీడియా ప్రభావం వలన కావచ్చు ఆంద్రా ప్రజలలో వైసీపీ ప్రభుత్వం పట్ల కొంత విముఖత ఏర్పడిందని వారి ద్వారా కేటీఆర్ తెలుసుకొన్నారు.
కనుక హైదరాబాద్లో స్థిరపడిన ఆంధ్రా ప్రజల మనోగతం తెలుసుకొనేందుకే మంత్రి కేటీఆర్ ఆ చిన్నపొడి వేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ సానుకూల స్పందన వస్తే మున్ముందు వైసీపీపై మరిన్ని బాణాలు సందిస్తూ, వారిని ప్రసన్నం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. కానీ ఈ వ్యాఖ్యలతో గొడవ పెద్దది అవుతుండటంతో సిఎం కేసీఆర్ కలుగజేసుకొని హెచ్చరించడంతో కేటీఆర్ వెంటనే “నేను ఆ మాటలు ఉద్దేశ్యపూర్వకంగా అనలేదంటూ..” ఆ కధ ముగించేసినట్లు సమాచారం.