తెలంగాణ ప్రభుత్వానికి హైదరాబాద్ హైకోర్టులో మరోసారి చుక్కెదురైయింది. ఇటీవలే అసెంబ్లీ నుండి బహిష్కరింపబడిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్కు హైకోర్టులో ఊరట లభించింది. వారిపై విధించిన అసెంబ్లీ బహిష్కరణ ఉన్నత న్యాయస్థానం ఎత్తివేసింది. వారి శాసనసభ సభ్యత్వాలను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీచేసింది.
వారు తప్పు చేశారని భావిస్తే ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు గానీ.. అసెంబ్లీ బహిష్కరణ సరికాదని న్యాయస్థానం పేర్కొంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో కోమటిరెడ్డి వెంటకరెడ్డి హెడ్ఫోన్ను విసరగా అది శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలింది.
క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్పై ప్రభుత్వం అసెంబ్లీ బహిష్కరణ విధించింది. వారి శాసన సభ్యత్వాలు రద్దయినట్లు జీవో జారీచేసింది. ఆ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలంటూ ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసింది. అయితే స్వామిగౌడ్పై దాడికి సంబంధించి క్రిమినల్ చర్యలు తీసుకోవాలనుకుంటే ఈ తీర్పు అడ్డంకి కాదని కోర్టు తెలిపింది.