Polavaram Project ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలంతో పాటు బొగ్గు గనులున్న ప్రాంతాలకూ ముప్పు వాటిల్లుతుందన్న ఆందోళన వ్యక్తం చేసిన తెలంగాణ సర్కారు, ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఈ సమస్య తొలగాలంటే, సమగ్ర సర్వే చేపట్టాలని, ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలను తెలియజేయాలని సుప్రీం ఆదేశించడంతో తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ వైద్యనాథన్ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్టును 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహ వేగం వస్తుందన్న అంచనాతో నిర్మిస్తున్నారని చెబుతోంది తెలంగాణ.

గోదావరిలో అంత ప్రవాహం వస్తే, భద్రాచలం, మణుగూరు తదితర ప్రాంతాలు తీవ్రమైన ముంపునకు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. తమ రాష్ట్ర భూభాగం, ఇక్కడి ప్రజల మనోభావాలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, మరోసారి సర్వే చేసి తుది నిర్ణయం తీసుకోవాలని కోరింది.