దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ ఘనవిజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి రఘునందనరావు తన సమీప ప్రత్యర్థి తెరాస నుండి పోటీ చేసిన సోలిపేట సుజాతపై 1,079 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మెజారిటీ విషయంలో ఇది చిన్నగా కనిపించినా తెరాసని తన కంచుకోటలో ఓడించడం అంటే అనితరసాధ్యమైన విజయం అనే చెప్పుకోవాలి.
దుబ్బాక నుండి రఘునందనరావు పోటీ చెయ్యడం ఇది మూడవ సారి. 2014, 2018 ఎన్నికలలో ఇదే స్థానము నుండి పోటీ చేసిన ఆయన మూడవ స్థానంకే పరిమితం అయ్యారు. ఈసారి రఘునందనరావు గెలిచే అవకాశం కనిపించడం తో అధికార తెరాస ఆయన మీద 2018లో రేవంత్ రెడ్డి మీద ప్రయోగించిన అస్త్రమే ప్రయోగించింది.
పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులను మోహరించి రేవంత్ రెడ్డిని అప్పట్లో అష్టదిగ్బంధనం చేసింది. డబ్బులు పంచుతున్నారు అంటూ హడావిడి చేసి ప్రచారం కూడా చేసుకోనివ్వ లేదు. అలా సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో ఓడించింది. రఘునందనరావు పై కూడా ఇటువంటి పథకమే అమలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.
ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కారణంగా రఘునందనరావు కు అది సింపతీగా మారింది. రేవంత్ సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరు ఆయనకు మద్దతుగా నిలవలేదు. అయితే బీజేపీ అంతా కదిలివచ్చి రఘునందనరావు కు సపోర్ట్ చేసింది. దానితో మీడియా కవరేజ్ కూడా ఎక్కువగా వచ్చి ప్రజల మద్దతు పొందాడు రఘునందనరావు.