తెలంగాణ ఇచ్చి కూడా పట్టుమని పాతిక సీట్లు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంది కాంగ్రెస్. గెలిచిన వారిలో కూడా చాలా మంది ఇప్పటికే తెరాసలో చేరిపోయారు. ఇది ఇలా ఉండగా ఉన్న వాళ్ళు కూడా కలిసికట్టుగా ఉండలేని పరిస్థితి. ఇందిరాపార్క్ వద్ద ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, వీహెచ్, తెలంగాణ తెదేపా అధ్యక్షడు ఎల్.రమణ, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరామ్, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు.
కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జి కుంతియా కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో టీపీసీసీ అధికార ప్రతినిధి నగేశ్ కూర్చనేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో నగేశ్, వీహెచ్కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వీహెచ్ చేయిచేసుకోవడంతో నగేశ్ ఆయన చొక్కాపట్టుకున్నారు. తోపులాటలో ఇ్దదరూ కిందపడిపోయారు. దీంతో అప్రమత్తమైన అఖిలపక్ష నేతలు కిందపడిపోయిన వీహెచ్ను పైకి లేపారు. ఇద్దరి మధ్య సయేధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు.
ఒక్క కూర్చీ కోసం ఇద్దరు నేతలు బాహాటంగా బాహాబాహీకి దిగారంటే తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. తమ నిరసన కార్యక్రమంతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాల్సి పోయి సొంత పార్టీకే చెమటలు పట్టిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇందుకు కాదు కాంగ్రెస్ ని కేసీఆర్ తొక్కి పట్టి నార తీస్తున్నది? ఈరోజో రేపో ఆ పార్టీ శాసనసభ పక్షాన్ని తెరాస శాసనసభా పక్షంలోకి విలీనం చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు కేసీఆర్. అయినా కాంగ్రెస్ నేతలు విజ్ఞత ప్రదర్శించలేకపోవడం దురదృష్టకరం.