పార్టీ మారడానికి వంక వెతుకుంటున్నారో ఏంటో తెలియదు గానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన యురేనియం తవ్వకాల వ్యతిరేక సమావేశానికి కాంగ్రెస్ నేతలు వెళ్లడంపై ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ భగ్గుమన్నారు. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా అక్కడకు వెళ్ళడమేమిటి? అని ఆయన టిపిసిసి కార్యవర్గ సమావేశంలో గట్టిగా ప్రశ్నించారట. ఆయనకు మరి కొందరు నేతలు మద్దతు పలికారట.
జనసేన బ్యానర్ పై ఏర్పాటు చేసిన సభలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్, మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వీహెచ్ లాంటి నాయకులు అక్కడకు వెళ్లి 4 గంటలు కూర్చోవడం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. మన బలం తో పవన్ను హీరో చేయడమెందుకు? అని ఆయన ప్రశ్నించారని కథనం వచ్చింది.దీనిపై కాంగ్రస్ పార్టీ పోరాటం చేస్తుంటే, ఆ క్రెడిట్ అంతా పవన్ కు అప్పగిస్తారా?ఆయనకు తెలంగాణకు సంబందం ఏమిటని అని ఆయన ప్రశ్న.
సంపత్ చెప్పిన దాంట్లో కొంత నిజం ఉంది గానీ కేసీఆర్ ను ఒంటరిగా ఎదురుకునే శక్తి కాంగ్రెస్ కు లేదని 2018 చివరిలో జరిగిన ఎన్నికలలోనే తేలిపోయింది. మిగతా పార్టీల వారిని కలుపుకుని పోరాటాలు చెయ్యడం ఎంతో ముఖ్యం. అందులోనూ పవన్ కళ్యాణ్ వంటి చరిష్మా గల నాయకుడు సహకారం ఉంటే మంచిదే. తెలంగాణను పవన్ కళ్యాణ్ ఎలాగూ సీరియస్ గా తీసుకునే పరిస్థితి లేదు. దానితో సంపత్ కుమార్ భయంలో పెద్దగా అర్ధం లేదనే చెప్పుకోవాలి.