ఇటీవలే జరిగిన దుబ్బాక ఉపఎన్నిక ఫలితం రాజకీయ వర్గాలలో సంచలనం సృష్టిస్తుంది. గెలిచిన బీజేపీ జీహెచ్ఎంసి ఎన్నికలలో కూడా ఇదే తరహా ఫలితం రాబట్టడానికి తహతహలాడుతుంటే… అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం అయోమయంలో ఉంది. జీహెచ్ఎంసి ఎన్నికలలో విజయం సాధించడానికి వ్యూహాలు రచించడం మొదలుపెట్టింది బీజేపీ.
ముఖ్యమంత్రి కేసీఆర్ గాజ్వెల్ నియోజకవర్గానికి, మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గానికి, హరీష్ రావు సిద్దిపేటకి కూతవేటులో ఉన్న దుబ్బాకలో పాగా వెయ్యడంతో కమలనాథులు జోష్ మీద ఉన్నారు. ఏకంగా జీహెచ్ఎంసి ఎన్నికలలో 100 సీట్లు గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.
ఇందులో భాగంగా తెరాస నాయకుల మీద, క్యాడర్ ని తమ వైపుకు లాక్కోవడానికి టార్గెట్ చేస్తున్నారు. 2014లో జరిగిన జీహెచ్ఎంసి ఎన్నికలలో అప్పుడే అధికారంలోకి వచ్చిన జోష్ లో ఉన్న తెరాస 99 సీట్లు సాధించి చరిత్ర సృష్టించింది. అప్పుడు కొత్త రాష్ట్రం ఊపుకు తోడుకోవడంతో అది సాధ్యపడింది.
ఇప్పుడు బీజేపీ 100 వార్డుల టార్గెట్ అంటే అత్యాశే అని చెప్పుకోవాలి. పైగా జీహెచ్ఎంసిలో నలభై డివిజన్ల దాకా ఎంఐఎం ప్రాబల్యం ఉన్నవే. అంటే బీజేపీ తెరాస ను 10 సీట్లకు అలా పరిమితం చేసేయ్యాలి. అదే జరిగితే పెను సంచలనం అనే చెప్పుకోవాలి. డిసెంబర్ 4న జీహెచ్ఎంసి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.