తెలంగాణ బీజేపీ నేతలు మాటలు కోటలు దాటతాయి, చేతలు గడపలు దాటవు. తాజాగా ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మాటలు కూడా అలాగే ఉన్నాయంటూ పలువురు ఎద్దేవా చేస్తున్నారు. కేసీఆర్ క్వారంటైన్ ముఖ్యమంత్రి అని, ఆరేళ్లుగా ఆయన బయటకే రాలేదని ఎంపీ బండి విమర్శించారు.
సీ ఓటర్ సర్వేలో సీఎం కేసీఆర్ ర్యాంకు 16వ స్థానం ఉందని, కొండ పోచమ్మ చెరువు నుంచి ఒక్క ఎకరానికైనా నీళ్లిచ్చారా అని బండి ప్రశ్నించారు. వర్షం పడితే పూలు చల్లి కాళేశ్వరం నీళ్ళని చెప్పుకుంటున్నారని, రాష్ట్ర ముఖ్య మంత్రి బండారాన్ని బయట పెడుతామని హెచ్చరించారు. 100 శాతం కేసీఆర్ జైలుకు వెళ్ళడం ఖాయమని ఆయన చెప్పుకొచ్చారు.
“తెలంగాణలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్న్యాయం. కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ. వచ్చే ఏడాది మేము అధికారంలోకి వచ్చి మేము విముక్తి కలిగిస్తాం,” అన్నారు ఆయన. ఇటీవలే పార్టీ అధ్యక్ష పీఠం దక్కించుకున్న సంజయ్ మీడియాలో ఈ మధ్య గట్టిగానే హడావిడి చేస్తున్నారు.
అయితే ఓటర్ల మీద ఆయన ఎంతవరకూ ప్రభావం చూపించగలరా అనే దానిపై తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇప్పటికైతే ఆ పార్టీ పూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్ మీదే ఆధారపడి ఉంది. బండి సంజయ్ కూడా అలాగే ఎంపీ అయ్యారు.