ధోని కెప్టెన్ అయిన తొలినాళ్ళల్లో… ఓటమి పాలవుతాయని భావించిన మ్యాచ్ లలో కూడా అనూహ్యంగా విజయాలు అందుకుంది టీమిండియా… అయితే ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే… ఖచ్చితంగా గెలుస్తుందని భావిస్తున్న మ్యాచ్ లలో చివరి క్షణంలో చతికిలపడి ఓటమి పాలవుతోంది. మరో విశేషమేమిటంటే… అప్పుడు గెలిచిన మ్యాచ్ లలో ధోని చేయూత ఏ స్థాయిలో ఉందో విజ్ఞులకు తెలిసిన విషయమే. కానీ, ప్రస్తుతం ఓటమి పాలవుతున్న మ్యాచ్ లలో ధోని చాలా కీలకపాత్ర పోషిస్తున్నాడు… అయితే అది కెప్టెన్ గా కాదు, ఒక బ్యాట్స్ మెన్ గా..!
ఇటీవల కాలంలో ధోని బ్యాటింగ్ ప్రతిభ వలన ఓటమి పాలైన జాబితాలో మరో మ్యాచ్ చేరింది. శనివారం నాడు తలపడిన మొదటి టీ 20 మ్యాచ్ లో వెస్టీండీస్ చేతిలో ఒక పరుగు తేడాతో టీమిండియా ఓటమి పాలవ్వడం అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ముఖ్యంగా ధోని చేసిన అతి జాగ్రత్త ప్రభావమే మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపిందని చెప్పవచ్చు. 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసిన ధోని బ్యాటింగ్ ప్రేక్షకులకు అసహనానికి గురి చేసిందని చెప్పడంలో సందేహం లేదు.
మ్యాచ్ ను చివరి ఓవర్ దాకా తీసుకువెళ్ళాలనే అతి జాగ్రత్తే ధోనిలో కనపడింది తప్ప… త్వరగా ముగించేసి విజయాన్ని సాధిద్దాం అన్న ధోరణి మాత్రం ఎక్కడా తారసపడలేదు. ఒకానొక స్థాయిలో ధోని ఆడుతుంటే… స్టేడియంలో ప్రేక్షకులు రాహుల్… రాహుల్… అని కేకలు పెట్టారంటే ఏ రేంజ్ లో తయా బ్యాటింగ్ ప్రతిభ చూపించాడో అర్ధం చేసుకోవచ్చు. కీలకమైన దశలో డాట్ బాల్స్ ఆడిన ధోని, చివరి ఓవర్ లో 6 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన తరుణంలో నిర్లక్ష్యమైన ఆటతీరుతో భారత జట్టుకు ఓటమిని అందించడంలో ప్రధాన పాత్ర పోషించాడు.
ధోని అతి జాగ్రత్త వలన రాహుల్ అద్భుతమైన పోరాట పటిమ (51 బంతుల్లో 110 పరుగులు) వెలవెలబోయింది. చివరి ఓవర్ మొదటి బంతికి ధోని ఇచ్చిన ఈజీ క్యాచ్ ను శామ్యూల్స్ వదిలేయడమే వెస్టీండీస్ జట్టుకు వరంగా మారింది. బహుశా ఆ క్యాచ్ పట్టుకుని ఉంటే ఫలితం భారత్ కు అనుకూలంగా వచ్చేదేమో అనే స్థాయికి ప్రేక్షకులకు వచ్చారంటే… ధోని ఏ స్థాయిలో ఆకట్టుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. చివరి బంతికి 2 పరుగులు చేస్తే గెలుపు, ఒక పరుగు చేస్తే ‘టై’ అయ్యి ‘సూపర్ ఓవర్’ వస్తుందనుకున్న తరుణంలో నిర్లక్ష్యంగా ఆడిన ధోని క్యాచ్ ఇచ్చి టీమిండియా ఓటమికి కారణమయ్యాడు. అద్భుతమైన ఓవర్ తో ధోనిని బోల్తా కొట్టించడంలో బ్రావో పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యాడు.