ఇండియా – వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ రసకందాయంలో పడింది. నాలుగవ రోజు ఆటలో ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ స్వింగ్ కు లొంగిన విండీస్ బ్యాట్స్ మెన్లు ఒక్కొక్కరిగా పెవిలియన్ బాట పట్టారు. దీంతో 225 పరుగులకు విండీస్ జట్టు ఆలౌట్ అయ్యింది. భువనేశ్వర్ కుమార్ 5 వికెట్లతో సత్తా చాటగా, అశ్విన్ 2, ఇషాంత్ శర్మ, జడేజా చెరొక వికెట్ సొంతం చేసుకున్నారు.
అనంతరం రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 39 ఓవర్లలో 157 పరుగులు చేసి మొత్తం 285 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఓపెనర్ రాహుల్ 28, శిఖర్ ధావన్ 26, కోహ్లి 4 పరుగులకు అవుట్ కాగా, రెహనే 51, రోహిత్స్ శర్మ 41 పరుగులతో క్రీజులో ఉన్నారు. చేతిలో 7 వికెట్లు ఉన్నప్పటికీ, ఆటలో ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. దీంతో వీలైనంత త్వరగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి, విండీస్ ను ఆలౌట్ చేస్తే భారత్ కు విజయావకాశాలు ఉంటాయి.
ఇప్పటికే 285 పరుగుల ఆధిక్యంలో ఉండగా, మరో 50 పరుగులైతే ఖచ్చితంగా టీమిండియా జోడించి డిక్లేర్ చేస్తుంది. అంటే చివరి రోజు 300కు పైగా పరుగులు విండీస్ చేధించాల్సి ఉంటుంది. ఇది సాధ్యమయ్యే విషయం కాదు. దీంతో మ్యాచ్ డ్రా దిశగా సాగుతుందా? లేక టీమిండియా సొంతం చేసుకుంటుందా? అన్న దానిపైనే ఆసక్తి నెలకొంది.