జనసేన ఇసుక కొరతతో అలమటిస్తున్న కార్మికులకు మద్దతుగా పిలుపునిచ్చిన విశాఖపట్నం లాంగ్ మార్చ్ కు తెలుగుదేశం, లోక్ సత్తా తప్ప ఎవరూ హాజరు కాలేదు. గత ఎన్నికలలో పవన్ పార్టీతో కలిసి పోటీ చేసిన వామపక్ష పార్టీలు సైతం హ్యాండ్ ఇచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ సంఘీభావం తెలుపుతాము గానీ మేము విడిగానే కార్యక్రమాలు చేపడతాం అంటూ మొహం చాటేశాయి.
పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయా పార్టీ నేతలతో ఫోన్లు చేసి మాట్లాడినా ఎవరు రాలేదు. టీడీపీ తరపున మాజీ మంత్రులు … అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు హాజరు అయ్యారు. మరో మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరవుతారని ముందుగా ప్రచారం జరిగినా ఆయన రాలేదు. దీనితో గంటా గైర్హాజరుపై రాజకీయ వర్గాలలో చర్చజరుగుతోంది.
కొంతకాలంగా గంటా పార్టీని వీడి బీజేపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆయన పార్టీ వ్యవహారాలలో అంటీముట్టనట్టు ఉంటున్నారు. పలు సందర్భాలలో పార్టీ మారే ఉద్దేశం లేదు అని చెప్పినా గంటా చర్యలు అనుమానాస్పదంగానే ఉంటున్నాయి. ఈ గైర్హాజరుతో ఆ ఊహాగానాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే టీడీపీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయం తలపోటుగా మారింది. గంటా విషయంలో మరో షాక్ తగలనుందా అనే చర్చజరుగుతోంది. పైగా గంటా వెళ్లడం అంటూ జరిగితే పార్టీలు చీలిక కూడా తెస్తారని వ్యాఖ్యలు ప్రధానప్రతిపక్ష పార్టీని మరింత కలవరపెడుతున్నాయి.