కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం విఫలమయ్యిందని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, ఎంపీలే మాట్లాడుకుంటున్నారు అంటూ ఒక వీడియోని టీడీపీ విడుదల చేసింది. ఆ వీడియోని ఉటంకిస్తూ… టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జగన్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. జగన్ చేతగాని పాలనను జనమే కాకుండా సొంత పార్టీ నేతలే ఎండగడుతున్నారని ఎద్దేవా చేశారు
“ఈ విషయం మూర్ఖపు ముఖ్యమంత్రికి చెబితే సొంత పార్టీ అని కూడా చూడకుండా కక్షసాధింపులకు దిగుతాడని భయపడి బయట ఎవ్వరూ నోరు మెదపట్లేదు,” అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. “కరోనా నియంత్రణకి జగనేం చేశాడు..బొక్క చేశాడు“ అంటూ పులివెందుల పిల్లి మెడలో తొలి గంట కట్టాడు ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ గారు. ప్రభుత్వం లాజిస్టిక్స్ మెయింటెన్ చేయడంలేదు..జగన్ “ చేతులెత్తేశాడు“ అని మీ ఆకుల ఆగ్రహంగా ఉన్నారు,” అని లోకేష్ అన్నారు.
“నేను మూర్ఖపురెడ్డి అంటే ఉలిక్కిపడి బూతులమంత్రిని బూతులతోనో, పేటీఎం బ్యాచీలను ఫేక్ ట్వీటులతోనో దింపుతావు. నిన్ను మీవాళ్లే అంటున్నారు నర్మగర్భంగా మూర్ఖపురెడ్డి అని,” అన్నారు ఆయన. అయితే ఈ వీడియో పై వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా టీంలు ఏదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాయి.
వారి మాటలు అసందర్భంగా కట్ చేసి వక్రీకరించారని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశాయి. అయితే ఆ వివరణ పెద్దగా అతికినట్టుగా లేదని సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై పార్టీ స్థాయి నుండి స్పందన లేకపోవడమే ఇందుకు నిదర్శన అని అంటున్నారు.