రాజ్యసభలో కేవీపీ బిల్లు సందర్భంగా టిడిపి ఎంపీ సుజనా చౌదరి చేసిన ప్రసంగం పట్ల సర్వత్రా విమర్శలతో కూడిన ఆగ్రహం వ్యక్తమవుతోంది. సుజనా ప్రసంగంపై సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబే తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటే… ఏ రేంజ్ లో సుజనా ప్రసగించారో అర్ధం చేసుకోవచ్చు. రాజ్యసభలో మిగిలిన అన్ని పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదాకు సానుకూలంగా వ్యాఖ్యలు చేయగా, సుజనా చౌదరి మాత్రం బిజెపిని వెనకేసుకు రావడం విస్మయానికి గురి చేసింది.
తమ ప్రభుత్వం అన్ని చేస్తోంది… అయినా విమర్శలను ఎదుర్కొంటోంది… దీనిపై తానూ వివరణ ఇవ్వాలి అంటూ దాదాపుగా 15 నిముషాల పాటు సాగిన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీపై అక్కసు తప్ప, అధికార పార్టీ బిజెపిపై ఒత్తిడి తెచ్చే వ్యాఖ్య ఒక్కటి కూడా చేయకపోవడం విశేషం. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరిచినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీ మాదిరి కాకుండా, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఎంపీ తరహాలో సుజనా వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శలతో కూడిన ఆగ్రహజ్వాలలు ప్రదర్శితం అవుతున్నాయి.
తాజాగా సినీ నటుడు శివాజీ కూడా సుజనా తీరుపై మండిపడ్డారు. బ్యాంకులను మోసం చేసి వందల కోట్లు కొల్లగొట్టిన సుజనా చౌదరి, బిజెపికి వత్తాసు పలుకుతూ ఏపీని తాకట్టు పెడుతున్నారంటూ విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో బిజెపి ఎక్కడ కనపడితే అక్కడ తరిమికొట్టండి అంటూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు శివాజీ. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి, కేంద్రం దగ్గర మార్కులు కొట్టేసి, తన కంపెనీలను కాపాడుకోవడానికే సుజనా ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు గతంలోనే వ్యక్తమైన నేపధ్యంలో… తాజాగా జరుగుతున్న పరిణామాలు అందుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
అప్పుడు కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ మోచేతి నీళ్ళు తాగుతూ, కాళ్ళు పట్టుకుంటున్నారంటూ విమర్శలు వ్యక్తం కాగా, తాజాగా సుజనా వంటి వారు తెలుగు కీర్తి ప్రతిష్టతలను ఢిల్లీ స్థాయిలో తాకట్టు పెడుతున్నారంటూ మండిపడుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఇటీవలే ముగిసిన రాజ్యసభ సభ్యత్వాన్ని మళ్ళీ కొనసాగిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి బహుశా సుజనా చౌదరి ఈ విధంగా ‘కృతజ్ఞతలు’ చెప్తున్నరేమో..!