నిన్న రాజ్యసభలో సభ అయిపోయిన తరువాత కూడా ఉండిపోయి నిరసన తెలిపిన టీడీపీ ఎంపీలను అతికష్టం మీద బయటకు పంపగలిగారు పార్లమెంట్ సిబ్బంది. ఈరోజు లోక్ సభ ఎంపీలు కూడా అదే ప్రయత్నం చెయ్యడంతో ప్రభుత్వం వారిని తెలివిగా బురిడీ కొట్టించి బయటకు పంపింది.
సభలో నిరసన తెలుపుతున్న ఎంపీలను స్పీకర్ పిలుస్తున్నారంటూ కబురు అందించారు అక్కడి సిబ్బంది. కలవడానికి వారు లోక్ సభ నుంచి బయటకు రాగానే తలుపులు మూసేసిన సిబ్బంది. తీరా ఎంపీలంతా స్పీకర్ కార్యాలయం వద్దకు వెళ్లగా ఆమె అప్పటికే వెళ్లిపోయినట్లు తెలిసింది.
దీంతో ఆగ్రహించిన ఎంపీలు స్పీకర్ తమను పిలిచి అవమానించారంటూ కార్యాలయంలోనే ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన అన్ని హామీలపై స్పష్టమైన ప్రకటన చేస్తే గానీ తాము ఆందోళన విరమించేది లేదని వారు భీష్మించుకుని కూర్చున్నారు. మరోవైపు ఆందోళన చేస్తున్న ఎంపీలను బయటకు తరలించేందుకు భద్రతా సిబ్బంది సన్నద్ధమవుతున్నారు. ఎంపీలు స్వచ్ఛందంగా బయటకు రాని పక్షంలో వారిని బలవంతంగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.