Batchula Arjunuduకృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ రూరల్ పరిధిలో కొత్తపల్లి గ్రామంలో టిడిపి గ్రామ కమిటీ అధ్వర్యంలో మంగళవారం బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి కొత్తపల్లి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తరువాత సంక్షేమ పధకాల పేరుతో జగన్ ప్రభుత్వం ఏవిదంగా సామాన్య ప్రజలను మోసాగిస్తోందో తెలియజేసే కరపత్రాలను గ్రామస్తులకు పంచిపెట్టారు.

ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “జగన్ ప్రభుత్వం ఓ చేత్తో ఇచ్చి మరో చేత్తో అంతకంటే చాలా ఎక్కువే గుంజుకొంటోంది. చంద్రబాబు నాయుడు హయాంలో టిడిపి ప్రభుత్వం ఒక్క దళితుల కోసమే 27 సంక్షేమ పధకాలను అమలుచేస్తే, జగన్ వాటన్నిటినీ పక్కన పడేసి మొదటిసారిగా తానే దళితులకు ఏదో మేలు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకొంటున్నారు. ఉదాహరణకి టిడిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన విదేశీ విద్యాపధకాన్ని మూడేళ్ళుగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయని దానినే పేరు మార్చి జగనన్న విదేశీ విద్యా పధకం అని చెప్పుకొంటున్నారు. కానీ దాని ద్వారా కూడా అర్హులైన పేద విద్యార్ధులందరూ విదేశాలలో చదువుకొనే అవకాశం కల్పించడం లేదు. రకరకాల ఆంక్షలు పెట్టి భారం తగ్గించుకొంటున్నారు. నిబద్దత లేని పధకాలు ఎన్ని ప్రవేశపెడితే ఏం ప్రయోజనం?మళ్ళీ ఆ భారం ప్రజలపైనే రుద్దుతున్నారు. అవి భరించలేక ప్రజలు మమ్మల్ని ఇలా బ్రతకనిస్తే చాలని అంటున్నారు,” అని అన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు, కార్యదర్శి పుట్టా సురేశ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు వల్లూరిపల్లి రామకృష్ణ ప్రసాద్, టిడిపి నాయకులు చెన్నుబొయిన శివయ్య, వడ్డెల్లి లక్ష్మి, దండు సుబ్రహ్మణ్య రాజు, కోరాం రాజు, రామకృష్ణ, గుండపనేని ఉమా వరప్రసాద్, మందాడి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.