టీడీపీ నుండి నాలుగవ ఎమ్మెల్యే బయటకు వచ్చారు. సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎం వైఎస్ జగన్తో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ భేటీ అయ్యారు. ఎంపీ విజయసాయిరెడ్డి గణేష్ను వెంటబెట్టుకుని వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమారులకు కండువా కప్పి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు.
అనర్హత తప్పించుకోవడానికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పుకోలేదు. అయితే ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ పార్టీలో చేరినట్టు చెప్పారు. గత ఎన్నికలలో రాష్ట్రం మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ గాలి వీచినా విశాఖపట్నం నగరంలో మాత్రం టీడీపీ హవానే కొనసాగింది. నగరం కింద ఉన్న నాలుగు సీట్లలో నాలుగూ టీడీపీకే వచ్చాయి.
అయితే విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేశాకా పరిస్థితి పూర్తిగా తమకు అనుకూలంగా మారిపోయిందని ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. వాసుపల్లి పార్టీలో చేరిన సందర్భంగా “విశాఖలో టీడీపీ తుడుచుపెట్టుకు పోతుందనడంలో సందేహం లేదు,” అని విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఒకవేళ అదే నిజమైతే వాసుపల్లిని డైరెక్టుగానే పార్టీలో చేర్చుకుని ఉపఎన్నికకు వెళ్లే వారు.
సహజంగా ఉపఎన్నికలలో అధికార పార్టీకి కొంత ఎడ్వాంటేజ్ ఉంటుంది అయినా ఉపఎన్నిక సాహసం చెయ్యకపోవడం గమనార్హం. అంటే విశాఖ మీద వైఎస్సార్ కాంగ్రెస్ కు ఇంకా పట్టు చిక్కలేదా? అనే అనుమానాలు రాకమానవు. ఇదంతా ఎలా ఉన్నా… టీడీపీ ఎమ్మెల్యేలు అందరినీ పార్టీలోకి తెచ్చి గ్రేటర్ విశాఖ ఎన్నికల నాటికైనా పార్టీని పటిష్ఠపరచాలని అధికార పార్టీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు.