బీసీ నేత, తెలుగుదేశం పార్టీ ఎల్ బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య పార్టీ మారే అవకాశం కనిపిస్తుంది. ఆయనను పార్టీలోకి రప్పించడానికి తెరాస ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కృష్ణయ్య కూడా సుముఖంగానే ఉన్నట్టు సమాచారం. ఈ మధ్య ఆయన ఆంధ్రలోని తెలుగుదేశం కు వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారు.
2014 ముందు కృష్ణయ్య టీడీపీలో జాయిన్ అయ్యారు. ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వడంతో పాటు చివరి నిముషంలో బీసీలను ఆకట్టుకోవడానికి ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడా చంద్రబాబు ప్రకటించారు. అయితే తరువాతి కాలంలో పార్టీలో ప్రాముఖ్యత లేదని ఆయన స్వతంత్రంగా వ్యవహరించడం మొదలు పెట్టారు.
అయితే సాంకేతికంగా ఆయన ఇప్పటికి తెలుగుదేశం ఎమ్మెల్యేనే. కేసీఆర్ మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష వల్ల ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. కృష్ణయ్య పోతే ఆ పార్టీ నుండి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాత్రమే మిగులుతారు.