కాకినాడ జిల్లా తునిలో ఈరోజు ఉదయం టిడిపి నేత, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగింది. అయ్యప్ప స్వామి మాల వేసుకొన్న ఓ వ్యక్తికి శేషగిరిరావు భిక్ష వేస్తుండగా, అతను హటాత్తుగా కొడవలితో ఆయనపై విచక్షణా రహితంగా దాడి చేసి బైక్పై పారిపోయాడు. ఈ దాడిలో శేషగిరిరావుకి చేతికి, తలకు గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను హాస్పిటల్కి తరలించారు. సమాచారం అందుకొన్న తుని పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. శేషగిరిరావు ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా సమాచారం అందవలసి ఉంది.
ఆయనపై దాడి చేసిన వెంటనే ఆ వ్యక్తి బైక్పై పారిపోవడం గమనిస్తే ఆయనను హత్య చేసేందుకు ప్లాన్ ప్రకారమే చేసినట్లు అర్దమవుతోంది. శేషగిరిరావుపై దాడి చేసిన వ్యక్తి ఆయనకు అపరచితుడు కనుకనే భిక్ష కోసం వచ్చాడనుకొని దగ్గరకు వెళ్ళినట్లు అర్దం అవుతోంది. కనుక రాజకీయ ప్రత్యర్ధులు ఎవరైనా ఆయనను హత్య చేసేందుకు కుట్ర పన్నారా?లేక ఏవైనా భూవివాదాల కారణంగా ఎవరైనా ఆయనను హత్య చేయాలని ప్రయత్నించారా? అనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలుతుంది. శేషగిరిరావుపై హత్యాయత్నాన్ని టిడిపి నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయనపై దాడి చేసిన వ్యక్తిని తక్షణం పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.