tdp leader gadde ramamohan about voluntary systemప్రభుత్వానికి లబ్ధిదారులకు మధ్య అనవసరంగా మూడో వ్యక్తిని దూర్చితే, ఆ బ్రోకర్ల వ్యవస్థ లబ్దిదారులను కమిషన్ల పేరుతో వేధించడం, వ్యక్తిగత రాజకీయ కక్ష్యలతో అర్హులను అనర్హులుగా చేయడం, ఇదిగో ఇలా అమాయకుల ఆస్తులను కాజేయడమే అవుతుంది అంటూ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థను ఉద్దేశించి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు చేసారు.

గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పధకాలు నేరుగా లబ్దిదారుల ఖాతాకే చేరేవి. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక తమ పార్టీ కార్యకర్తలకే వాలంటరీ పోస్ట్ లు కట్టపెట్టి లబ్దిదారులను పరిస్థితులకు అనుగుణంగా ప్రలోభ పెడుతున్నారు, లేదంటే భయపెడుతున్నారంటూ వాలంటరీ వ్యవస్థలో జరుగుతోన్న లుకలుకలను ఉద్దేశించి ప్రస్తావించారు.

వృద్ధాప్య పెన్షన్ 250 రూపాయలు పెరిగిందని, దానికి గాను ఈ కాగితంపై ఒక సంతకం పెట్టాలంటూ వాలంటీర్లు తమతో తప్పుడు ధృవ పత్రాల మీద సంతకాలు పెట్టించుకున్నారని కలెక్టర్ వద్దకే వచ్చి, స్పందనలో తన గోడును వెలిబుచ్చినా ఆ వృద్ధురాలి ఉదంతాన్ని తన సోషల్ మీడియాలో పంచుకున్నారు గద్దె. తోటి సహచర నాయకుడితో మరో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు గొంతు కలిపారు.

సేవారత్న; సేవామిత్ర; సేవాప్రజా అంటూ సేవా పురస్కారాలు ఇచ్చారు కదా, ప్రజల సొమ్ము కాజేసిన ఈ వాలంటీర్ వ్యవస్థకు ఏ బిరుదు ఇస్తే బాగుంటుందో ఆలోచించండి జగన్ అంటూ నేరుగా ముఖ్యమంత్రినే నిలదీశారు అయ్యన్న. ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ వ్యవస్థ అయినా, ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా ఉండాలి కానీ ఇలా వేదింపులకు గురి చేయకూడదనేది సగటు ప్రజల ఆవేదన.

వాలంటరీ వ్యవస్థ ఉద్దేశం… ప్రజల కష్ట – నష్టాలను నేరుగా ప్రభుత్వానికి తెలిపేదిలా ఉండాలి; అక్రమంగా ప్రభుత్వ పధకాలను అనుభవిస్తున్న వారిపై చర్యలు తీసుకుని అర్హులైన వారికి పధకాలు అందించే విధంగా ఉండాలి కానీ, ఇలా ప్రజలను మోసగించడమో లేదా అధికార పార్టీకి ఓటు వేయకపోతే పధకాలను ఆపివేస్తామని భయపెట్టడమో లేదా మా పార్టీకి ఓటు వేస్తే ప్రభుత్వ పధకాలలో మీ పేరుని జత చేస్తామని ప్రలోభ పెట్టడమో కానీ చేయకూడదు.

ప్రభుత్వం – వాలంటరీ వ్యవస్థ రెండు పారదర్శకంగా పని చేసిన నాడే ఇటువంటి విమర్శలకు చెక్ పడుతుంది.