టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతి నుండి ఆ పార్టీ కోలుకోక ముందే మరో దుర్ఘటన జరిగింది. ఆ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత మాజీ చిత్తూర్ ఎంపీ శివప్రసాద్ కాసేపటి క్రితం కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. కాసేపటి క్రితం చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
2009, 2014లో చిత్తూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ తరఫున ఆయన బరిలో దిగి విజయం సాధించారు. ఇటీవలే జరిగిన ఎన్నికలలో ఆయన ఓడిపోయారు. సినీరంగంలోనూ ఆయనకు ప్రవేశముంది. కొన్ని సినిమాలకు ఆయన దర్శకత్వం కూడా వహించారు. చేసినవి కొన్ని పాత్రలే అయినా ఆయన విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్నారు.
ఓవైపు సినిమాల్లో రాణిస్తూనే రాజకీయాల్లోనూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో, ఆ తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వివిధ వేషాలతో తనదైన శైలిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కొందరు ఆయనను విమర్శించినా తన వేషాలతో మీడియా దృష్టిని ఆకర్షించేవారు మరోవైపు ఎంపీగా పార్లమెంటులోనూ రాష్ట్ర ప్రయోజనాల కోసం వాణిని బలంగా వినిపించారు.
శివప్రసాద్ చంద్రబాబు కలిసి చదువుకున్నారు. శివప్రసాద్ ను పరామర్శించడానికి చంద్రబాబు నిన్నే చెన్నై వెళ్ళారు ఆ తరువాతి రోజే ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది. ఈ వార్త విని టీడీపీ శ్రేణులు శోకసముద్రంలో మునిగిపోయారు.