Nara-Lokesh TDP Former Ministerఏపీ ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన ప్రవేశపెట్టిన 2022 బడ్జెట్ పై నారా లోకేష్ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తపరిచారు. “అమ్మ ఒడి అనేది అబద్ధం… నాన్నబుడ్డి నిజం.,” “వాహన మిత్ర అనేది అబద్ధం… డ్రైవర్లను మోసం చేసింది నిజం.,” “కరెంటు చార్జీలు పెంచడం నిజం,” ఆ పెరిగిన బిల్లులను అడ్డుపెట్టుకొని “సంక్షేమ పధకాలను ఆపడం నిజం.,” అంటూ అధికార ప్రభుత్వ తీరును ఏకరువు పెట్టారు.

రైతుల సంక్షేమం కోసమే మోటార్లకు మీటర్లు అనేది అబద్ధం… ఆ మోటర్లే రైతుల పాలిట ఉరితాడ్లు అనేది నిజం., మద్యపాన నిషేధం అనేది అబద్ధం., మద్యం మీద అప్పు తేవడం నిజం… కాదా అంటూ జగన్ రెడ్డి పాలనను “పంచ్ లు – ప్రాసలతో” ఏకిపారేసారు నారా లోకేష్. “స్కాములు – స్కీముల” ప్రభుత్వం అని, వీరికి “దాచుకోవం – దోచుకోవడం” తప్ప ఏమి తెలియదని ఎద్దేవా చేశారు.

లోకేష్ ఇచ్చిన ఊపుతో తోటి టీడీపీ నేతలు వైసీపీ నాయకుల పై ఏమాత్రం “తగ్గేదేలే” అన్న చందంగా విరుచుకుపడ్డారు. “సబ్జెక్టును పక్కదారి పట్టించే నీ పిట్ట కధలు, బుర్ర కథల” వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏముందో బుగ్గన సమాధానం చెప్పాలని” నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.

“దోపిడీలు – దౌర్జన్యాలే” ఈ వైసీపీ పార్టీ పెట్టుబడులని., ఇళ్ల స్థలాల పేరుతొ పేదవారి దగ్గర సొమ్ములు దోచేసి ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలు చేయడమే ప్రభుత్వ విధిలో భాగమైపోయాయని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం., మరుగుదొడ్ల మీద పన్ను., రిజిస్టేషన్ల మీద పన్ను ఇలా పన్ను మీద పన్నేసి సామాన్యుడి నడ్డి విరిచింది ఈ జగన్ ప్రభుత్వం అంటూ చెలరేగిపోయారు గోరంట్ల.

“మూడు రాజధానులు అనేది అబద్ధం., అమరావతే రాజధాని అనేది నిజం” అంటూ రాజధానిపై వైసీపీ ప్రభుత్వానికి ఒక స్పష్టమైన వైఖరి ఉండదని, ఒకసారి మూడంటారు., మరోసారి నాలుగంటారు, ఇలా అంకెల సంఖ్యను పెంచుతున్నారు కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని గౌరవించట్లేదని అచ్చెన్నాయుడు తన ఆక్రోశాన్ని వెల్లడించారు. కోర్టుల మీద., తీర్పుల మీద గౌరవం లేని వ్యక్తులు రాష్ట్రాన్ని పాలిస్తే పరిస్థితి ఇలానే ఉంటుందని టీడీపీ శ్రేణులంతా జగన్ ప్రభుత్వ తీరును ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని అందుకే తాము ఇక నుండి “జగన్ మోహన్ రెడ్డి” పేరుని “జగన్ మోసపు రెడ్డి” గా మారుస్తున్నామని లాస్ట్ లో ఒక పంచ్ డైలాగ్ పేల్చి తమ స్పందనను ముగించారు లోకేష్.