బద్ద శత్రువులైన కాంగ్రెస్, టీడీపీ ఉమ్మడి శత్రువైన బీజేపీని అడ్డుకోవడానికి చెయ్యి కలపబోతున్నారని గత కొన్ని రోజులుగా బాగా ప్రచారం జరుగుతుంది. రెండు వైపుల నుండి దీనిపై ఎలాంటి ప్రకటన లేకపోయినా కుమారస్వామి ప్రమాణస్వీకారం రోజున చంద్రబాబు రాహుల్ గాంధీతో కరచాలనం చెయ్యడంతో ఈ పుకార్లు ఊపందుకున్నాయి.
రాష్ట్రంలో ఎవరితో పొత్తు పెట్టుకోబోమని ఇటీవలే నియమించబడ్డ ఎపి వ్యవహారాల ఇన్ చార్జీ ఊమెన్ చాంది చెప్పారు. తాము ఏ పార్టీతో అవగాహనకు రావడం లేదని, ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటామని ఆయన అన్నారు. ఎపిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇది కష్టసాద్యమైనదని తెలుసునని, అయినా ప్రజల వద్దకు వెళతామని, వారితోనే ఉంటామని ఆయన అన్నారు.
ఇంటింటికి కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లి వాస్తవ పరిస్తితి వివరించే యత్నం చేస్తారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా తదితర అంశాలను బిజెపి విస్మరించిందని ఆయన అన్నారు. అదే సమయంలో టిడిపి నాలుగేళ్లు బిజెపితో కలిసి ఉండి,ఇప్పుడు ప్రజలను తప్పు దారి పట్టించే యత్నం చేస్తోందని చాందీ అన్నారు. దీనితో ఈ ఊహాగానాలకు తెరపడినట్టే అనుకోవచ్చు.