TDP Chandra Babu Naidu Pravallika Chequeఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ విద్యార్థినికి ప్రోత్సాహకంగా అందించిన చెక్ చెల్లదంటూ బ్యాంకు అధికారులు తిప్పి పంపారు. దీంతో ఆ చెక్‌ను అందుకున్న విద్యార్థిని ఆనందం ఆవిరైంది. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన నామకల్లు ప్రవలిక అనంతపురం ఎస్కే యూనివర్సిటీలో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేసి, 2016 సంవత్సరానికి గానూ ప్రతిభా పురస్కారానికి ఎంపికైంది.

అక్టోబరు 13న విజయవాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రవలిక ప్రతిభా పురస్కారం ప్రశంసాపత్రం, 20 వేల డీడీ అందుకుంది. ఆ డీడీలో నామకల్లు ప్రవలిలక బదులు హారిక అనే పేరు ఉంది. దీంతో ఆ పేరును సరిచేసే క్రమంలో హైదరాబాద్‌లోని సిండికేట్ బ్యాంకు సిబ్బంది హారిక పేరు కనిపించకుండా దానిపై బ్యాంక్ సీల్ వేశారు. ఈ విషయం తెలియని ప్రవలిక, హిందూపురం ఆంధ్రాబ్యాంక్‌లో ఆ డీడీని తన అకౌంట్‌లో జమచేసేందుకు వెళ్లింది. దానిని పరిశీలించిన బ్యాంకు సిబ్బంది, నిబంధనల ప్రకారం డీడీ చెల్లదని తేల్చి చెప్పారు.

హైదరాబాద్ వెళ్లి డీడీ జారీ చేసిన బ్యాంకు సిబ్బందితో మరో సీల్ వేయించుకురావాలని, లేదంటే మరో డీడీ తీసుకురావాలని చెప్పడంతో ప్రవలిక ఆనందం ఆవిరైంది. ఇప్పుడు దీని కోసం హైదరాబాద్ వెళ్లాలా? వద్దా? అనే మీమాంసలో పడింది. ఈ విషయంలో అధికారులు స్పందిస్తారో? లేదో? వేచి చూడాల్సిందే. అయితే దీనిని అదునుగా చేసుకున్న సిఎం ప్రత్యర్ధి మీడియా వర్గాలు ‘సిఎం ఇచ్చిన చెక్కు చెల్లలేదు’ అంటూ ఓ రకమైన దుష్ప్రచారానికి తెరలేపారు. సిఎంపై రొటీన్ గా చేసే ప్రచారమే అయినప్పటికీ, ఇందులో ఒక విద్యార్థి ఆశ, ఆనందం కూడా ఉందన్న విజ్ఞతను మరిచి మరీ ప్రచారం చేయడం విస్తుగోలిపే విషయం.