టిడిపి విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో విశాఖలోని పెద గంట్యాడలో నిన్న బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంటును ప్రయివేటీకరణ చేస్తున్నా కేసులకి భయపడి సిఎం జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం చెప్పడం లేదు. స్టీల్ ప్లాంట్ మూతపడితే దానిలో పనిచేస్తున్న వేలాదిమంది ఉద్యోగులు, వారిపైనే ఆధారపడిన వారి కుటుంబాలు రోడ్డున పడతాయని సిఎం జగన్మోహన్ రెడ్డికి తెలియదా?మూడేళ్ళలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను రప్పించలేకపోయారు. ఒక్క ఉద్యోగం ఇప్పించలేకపోయారు. కనీసం స్టీల్ ప్లాంటునైనా కాపాడుకొంటే ఉన్న ఉద్యోగాలైనా నిలుస్తాయి కదా?
జగన్ ప్రభుత్వం దృష్టి ఎప్పుడూ ఛార్జీలు పెంచి ఆదాయం పెంచుకోవవడంపైనే ఉంటుంది తప్ప సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలు పట్టవు. మూడేళ్ళలోనే విద్యుత్, ఆర్టీసీ, ఇంటిపన్ను అన్నిటినీ పెంచేసి ప్రజలపై పెనుభారం మోపుతోంది. ఓ చేత్తో సంక్షేమ పధకాలు ఇస్తూ మరో చేత్తో అన్నిటి ఛార్జీలు పెంచేస్తూ ప్రజలను మోసం చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపవలసిన సమయం ఆసన్నమైంది,” అని అన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, మొల్లి ముత్యాలనాయుడు, గాజువాక టిడిపి సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, టిడిపి నాయకులు పులి వెంకటరామనా రెడ్డి, సోమినాయుడు, ముత్యాలు, మొల్లి పెంటిరాజు, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.