జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలు జాస్తి చేతలు నాస్తి అని తెలుగుదేశం పార్టీ అభిమానులు విమర్శిస్తున్నారు. తాజాగా ఒక పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… మరోసారి ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ జోస్యం చెప్పారు. ఆ సందర్భంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని టార్గెట్ చెయ్యడం పై టీడీపీ అభిమానులు గట్టిగా రియాక్ట్ అవుతున్నారు.
“2024 కంటే ముందే ఎన్నికలు రావచ్చు. ఆ దిశగా జనసేన సన్నద్ధం కావాలి. బలమైన కార్యకర్తలు ఉన్నారని చెప్పుకొనే టీడీపీ ఇవాళ ముందుకు వెళ్లడానికి ఎంతలా ఇబ్బందిపడుతుందో మనం చూస్తున్నాం. ఒక్క జనసైనికులు మాత్రమే ఎన్ని బెదిరింపులు, ఒత్తిళ్లు వచ్చినా ధైర్యంగా కాలర్ ఎత్తి నిలబడుతున్నారు,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
“జనసైనికులు కాలర్ ఎత్తి నిలబడుతున్నారు అనే విషయం పక్కన పెడితే… అసలు పవన్ కళ్యాణ్ నిలబడింది ఎప్పుడు? జీహెచ్ఎంసి ఎన్నికలలో ఆ పార్టీ ఎన్ని పిల్లి మొగ్గలు వేసిందో మనం ఇప్పటికే చూశాం. కనీసం ఒక్క ఎన్నికలో కూడా నిలబడే సత్తా లేని పార్టీ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతుందా?,” అంటూ వారు విమర్శిస్తున్నారు.
“ఇబ్బంది పడుతుంది అని పవన్ కళ్యాణ్ చెబుతున్న తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తిరుపతి ఉపఎన్నికకు అభ్యర్థిని ప్రకటించారు. జీహెచ్ఎంసిలో ఒంటరిగా పోరాడుతూ 111 స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టింది. జనసేన పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ ముందుగా తన పార్టీ గురించి అంతకంటే ముందుగా తన గురించి ఆలోచిస్తే మంచిది,” అని వారు ఘాటుగా విమర్శిస్తున్నారు.