గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్లో మృత్యువుతో పోరాడిన నందమూరి ఎన్టీ రామారావు మనుమడు తారకరత్న (40) శనివారం తుదిశ్వాస విడిచారు. ఇటీవల నందమూరి కుమార్తె ఆ తర్వాత పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మరణాలతో క్రుంగిపోతున్న నందమూరి, నారా కుటుంబాలకి తారకరత్న మరణం మరో పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. ముఖ్యంగా తారకరత్నతో చాలా అనుబందం ఉన్న జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బాలకృష్ణలు చాలా దుఃఖిస్తున్నారు.
బాలకృష్ణ దంపతులు, చంద్రబాబు నాయుడు, చిరంజీవి, జూ.ఎన్టీఆర్ దంపతులు, నారా లోకేష్ దంపతులు, కళ్యాణ్ రామ్, మురళీ మోహన్, తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, వైఎస్ షర్మిల ఇంకా పలువురు ప్రముఖులు ఆదివారం శంకర్పల్లి మండలం మోకిల గ్రామంలోని ఆయన నివాసానికి చేరుకొని తారకరత్నకి నివాళులు అర్పించారు.
ఈరోజు ఉదయం 9 గంటలకి తారకరత్న భౌతికకాయాన్ని అక్కడి నుంచి అభిమానుల సందర్శనార్ధం ఫిలిం ఛాంబర్కి తరలిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకి జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు.