Taraka Ratna Faintedటిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో చిన్న అపశృతి జరిగింది. ఆయనతో కలిసి పాదయాత్ర చేస్తున్న సినీ నటుడు తారకరత్న స్పృహతప్పి పడిపోయారు. వెంటనే ఆయనని కుప్పంలో కేసి హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం మరో హాస్పిటల్‌కి తరలించారు. ఈరోజు ఉదయం కుప్పంలో వరదరాజస్వామి ఆలయంలో పూజలు జరిపిన తర్వాత టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ప్రారంభించారు.

ఆయనతో పాటు నందమూరి బాలకృష్ణ, సినీ నటుడు తారకరత్న, వేలాదిగా కార్యకర్తలు బయలుదేరారు. దారిలో స్థానిక మసీదు వద్ద నారా లోకేష్‌ ఆగి ప్రార్ధనలు చేసిన తర్వాత బయటకి వస్తున్నప్పుడు చుట్టూ ఉండే జనం ఒత్తిడి ఎక్కువై ఊపిరాడక తారకరత్న స్పృహ కోల్పోయారు. అయితే పాదయాత్రలో అంబులెన్సు సిద్దంగా ఉండటంతో వెంటనే దానిలో హాస్పిటల్‌కి తరలించారు. తారకరత్నకి స్వల్పంగా హార్ట్ అటాక్ వచ్చిన్నట్లు సమాచారం.

ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా వివరాలు తెలియవలసి ఉంది. మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించబోతున్నట్లు సమాచారం. బాలకృష్ణ వెంటనే హాస్పిటల్‌కి చేరుకొని తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులని అడిగి తెలుసుకొన్నారు.