‘పద్మ’ అవార్డుల చుట్టూ రాజకీయం ఉంటుందని సినీ జనాలు, పొలిటికల్ వర్గాలు చెప్పుకుంటుంటాయి. అయితే పలువురు దిగ్గజాలు ఇప్పటికే ‘పద్మ’ అవార్డులపై సంచలన వ్యాఖ్యలు కూడా చేసారు. తాజాగా దర్శకరత్న దాసరి నారాయణరావు కూడా అవార్డుల తీరుతెన్నులను ఏకరువు పెట్టిన ఉదంతం తెలిసిందే. తాజాగా ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ళ భరణి కూడా సంచలన వ్యాఖ్యలు చేసారు.
“తనకు భవిష్యత్తులో పద్మశ్రీ అవార్డు వచ్చినా, దాన్ని స్వీకరించబోనని… తెలుగు పరిశ్రమలో ఎస్వీ రంగారావు, సావిత్రి, సూర్యకాంతం వంటి మహానటులకు దక్కని పద్మశ్రీ సత్కారం, తనకూ వద్దని, ఒకవేళ వచ్చినా తిరస్కరిస్తానని” స్పష్టం చేశారు. 28 సంవత్సరాల పాటు నాటకాలు వేశానని, సినీ నటుడు రాళ్లపల్లితో ఏర్పడిన పరిచయం తన జీవితాన్ని మార్చిందని, ఆయనే నాటకాల్లో అవకాశాలు ఇప్పించారని, ఆపై 700కు పైగా చిత్రాల్లో నటించానని తెలిపారు.
ఇక, తన బాల్యమంతా పశ్చిమ గోదావరి జిల్లా శంఖంపేట రైల్వే క్వార్టర్స్ లో గడిచిందని, స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు పోవడమే నిత్య కృత్యమని, దీనికి తోడు హత్యలు, దొంగతనాలు చేస్తున్న వారితో స్నేహంగా ఉండేవాడినని గుర్తు చేసుకున్న తనికెళ్ల, తాను సినిమాల్లోకి రాకపోయి వుంటే, ఏదో ఓ నేరం చేసి ఖమ్మం జైల్లో గడుపుతూ ఉండేవాడినని తన బాల్య విశేషాలను పంచుకున్నారు.