jayalalithaa-veelunamajayalalithaa-veelunamaదివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల సంగతి ఏంటన్న ప్రశ్నలకు క్రమంగా సమాధానాలు లభిస్తున్నట్లు అర్ధమవుతోంది. అసలు ఆమె తన ఆస్తులను ఏం చేయదలిచారు? తన వారసురాలిగా ఎవరిని నిర్ణయించారు? అసలు వీలునామా రాశారా? లేదా? అన్న చిక్కుముడులు క్రమంగా వీడే అవకాశాలు ఉన్నట్లు కనపడుతోంది. మీడియా వర్గాల తాజా సమాచారం మేరకు… జయలలిత ఎప్పుడో 16 ఏళ్ల కిందటే తన రక్త సంబంధీకురాలిపై వీలునామా రాసినట్టు తెలుస్తోంది.

హైదరాబాద్‌లోని జేజే గార్డెన్స్ చిరునామాతో ఉన్న రెండు ట్రస్టులను కూడా రిజిస్ట్రేషన్ చేయించినట్టు సమాచారం. అయితే వీలునామా ఎవరి పేరుపై రాశారన్న సంగతి మాత్రం తెలిసే వీలు లేదని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ల శాఖ నిబంధన ప్రకారం ‘బుక్ 3’లో నమోదైన వీలునామా సమాచారాన్ని వారసులకు (లీగల్ హెయిర్) తప్ప ఇతరులకు వెల్లడించడం వీలుకాదని అంటున్నారు. తనకున్న వెసులుబాటుతో ప్రైవేటు అటెండెన్స్ ద్వారా ఈ తంతు పూర్తి చేయించినట్టు సమాచారం.

అప్పట్లో మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని సబ్ రిజిస్ట్రార్ స్వయంగా జేజే గార్డెన్స్‌ కు వెళ్లి జయలలిత సంతకాలు తీసుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి, జూలై 14, 2000 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా తెలుస్తోంది. జయలలిత ప్రతిపక్షంలో ఉన్న ఆ సమయంలో వీలునామా, ట్రస్ట్‌ ల రిజిస్ట్రేషన్‌ ను తమిళనాడు చిరునామాతో కాకుండా హైదరాబాద్‌ లో తన గార్డెన్స్ ఉన్న పేట్ బషీరాబాద్‌ అడ్రస్‌తో రిజిస్ట్రేషన్ చేయించారని ఈ వార్తల సారాంశం.

‘పురుచ్చితలైవి బెస్ట్ చారిటబుల్ ట్రస్ట్, నమద్ ఎంజీఆర్ బెస్ట్ చారిటబుల్ ట్రస్ట్’ల నిర్వాహకురాలిగా జయ తన పేరుతో పాటు శశికళ, దినకరన్, భాస్కరన్, భువనేశ్వరి పేర్లను రిజిస్ట్రేషన్ సమయంలో చేర్చారు. 2001లో ట్రస్ట్ నిబంధనల్లో చిన్న చిన్న మార్పులు కూడా చేశారు. ట్రస్ట్ ద్వారా నిర్వహించే కార్యక్రమాలకు ఐటీ శాఖ అనుమతి తీసుకుంటామని, లేకుంటే కార్యక్రమాలు నిర్వహించబోమని సవరణ పత్రాల్లో పేర్కొన్నారు. ఆస్తుల కేసు విచారణ సందర్భంగా సీబీఐ, న్యాయస్థానాలకు ఈ రిజిస్ట్రేషన్ పత్రాలను సమర్పించినట్టు సమాచారం.

ఈ వీలునామా వివరాలు వెలుగులోకి వస్తే… ఎవరు అవాక్కవుతారు? అన్నదే హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని ఆస్తులను కేసీఆర్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుందని ఇటీవల వచ్చిన వార్తల నేపధ్యంలో… టీఆర్ఎస్ సర్కార్ కు జయ వీలునామా షాక్ కు గురి చేస్తుందా? లేక ‘అమ్మ’ తర్వాత అన్నీ తానై నడిపిస్తున్న శశికళకు పెద్ద జలక్ తగలనుందా? అన్నది తమిళనాట ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఈ వీలునామాను వెలుగులోకి తీసుకువచ్చేదెవరు?