Tamilians Support-for-Paneerselvam-తమిళనాడు ముఖ్యమంత్రిగా చివరికి పన్నీర్ సెల్వం ఉంటారో, శశికళ ఉంటారో గానీ, ప్రజల మద్దతు మాత్రం పన్నీర్ కే ఉంటోంది. మీడియా వర్గాలలో హల్చల్ చేస్తోన్న ప్రజానీకంతో పాటు, సోషల్ మీడియాలో కూడా పన్నీర్ సెల్వంకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఓ వెబ్ సైట్ పోల్ లో పాల్గొన్న లక్షలాది మంది ప్రజలలో 95 శాతం మంది పన్నీర్ కే తమ ఓటు అని తెగేసి చెప్పారు. దీనికి ప్రధాన కారణం… మాట్లాడటమే రాదనుకున్న తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం… ఒక్కసారిగా విశ్వరూపం ప్రదర్శించడం కూడా!

పన్నీర్ మాటల తూటాలకు, తెగువకు, ధిక్కార స్వరానికి శశికళ వర్గం బిత్తరపోతుంటే, సెల్వంకు భారీ ఎత్తున మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని మెరీనా బీచ్ లో పన్నీర్ కు మద్దతుగా ఆందోళనలు, ఉద్యమాలు జరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసు శాఖ భావిస్తోంది. జల్లికట్టు కోసం జరిగినంత ఉద్ధృతంగా ఈ ఆందోళనలు కూడా ఉంటాయని పోలీసు అధికారులు భావిస్తుండడంతో, మెరీనా బీచ్ వద్ద భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. గవర్నర్ సమాచారం బహిర్గతమయ్యే వరకు తమిళనాట ఉత్కంఠ వాతావరణం కొనసాగే అవకాశం ఉంది.