లోకనాయకుడు కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు వెండితెరపై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. కమల్ హాసన్ హీరోగా సెన్సషనల్ దర్శకుడు శంకర్ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు. బుధవారం ఆ సినిమా షూటింగ్ సెట్లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.
చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా సెట్లో ఒక్కసారిగా క్రేన్ క్రాష్ అవ్వడంతో ముగ్గురు టెక్నీషియన్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పదిమందికి పైగా గాయాలయ్యాయి. చెన్నై సినీ వర్గాల సమాచారం ప్రకారం టన్నుల బరువు ఉన్న క్రేన్ వాడే సమయంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు సినీ బృందం తీసుకోలేదని, దానితో ప్రాణ నష్టం జరిగిపోయింది.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్నారు. నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్మాతలు, క్రేన్ యజమాని, ఆపరేటర్, ప్రొడక్షన్ మేనేజర్పై కేసులు నమోదు చేసిన పోలీసులు.. నటుడు కమల్హాసన్, దర్శకుడు శంకర్కు సమన్లు జారీచేశారు.
దీనితో చిత్రబృందానికి ఈ విషయంగా తిప్పలు తప్పవా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా కొందరైతే ఈ పరిస్థితిని ముందుగానే ఊహించి కమల్ చనిపోయిన వారి కుటుంబాలకు చెరో కోటి రూపాయిలు ఇచ్చి వారితో ఇబ్బంది కలగకుండా చూసుకున్నాడు అనే విమర్శలు చేస్తున్నారు.