తెలుగు, తమిళ్, హిందీ సినిమాలలో తనదైన శైలితో సాగుతున్న హీరోయిన్లలో తాప్సీ పన్ను ఒకరు. మొదట్లో ఇండస్ట్రీలో నిలద్రొక్కుకోవడానికి కొన్ని కమర్షియల్ చిత్రాలు చేసినా ఆ తరువాత విభిన్న కధాంశాలతో సినిమాలు చేస్తూ కొన్నిసార్లు విమర్శలు, చాలాసార్లు ప్రశంశలు, అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకొంటోంది. ఇటీవల మిషన్ ఇంపాజిబుల్తో మరో ఫ్లాప్ పడినప్పటికీ ఆమెకు అనూహ్యమైన ఓ గొప్ప ఆఫర్ వచ్చింది.
అమీర్ ఖాన్ హీరోగా పికే, త్రీ ఈడియట్స్ వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత రాజ్కుమార్ హిరాని దర్శకత్వంలో నిర్మించబోతున్న ‘డుంకి’ అనే సినిమాలో తాప్సీకి ఆఫర్ వచ్చింది.
విశేషమేమిటంటే అనేక ఏళ్లుగా బాలీవుడ్లో సినిమాలు చేస్తున్న బాలీవుడ్ బాదుషా షారూక్ ఖాన్ తొలిసారిగా రాజ్కుమార్ హిరాని దర్శకత్వంలో సినిమా చేయబోతుంటే, అతనితో తొలిసారిగా తాప్సీ కలిసి నటించబోతోంది.
బాలీవుడ్లో రాజ్కుమార్ హిరాని దర్శకత్వంలో…ఆయన బ్యానర్లో సినిమా అంటే నటీనటుల కెరీర్లో ఓ మైలురాయిగా నిలుస్తుంటాయి. కనుక బాలీవుడ్లో అగ్రహీరో హీరోయిన్లు సైతం రాజ్కుమార్ హిరానితో ఒక్క సినిమా అయినా చేయాలని ఎదురుచూస్తుంటారు.
ఇటువంటి గొప్ప అవకాశం తాప్సీకి లభించడం, అది కూడా షారూక్ ఖాన్ వంటి పెద్ద హీరోతో కలిసి చేసే అవకాశం లభించడం చాలా అదృష్టమనే చెప్పాలి. ఇప్పటికే ఆమె సినీ కెరీర్లో అనేక గొప్ప చిత్రాలున్నాయి. ఈ సినిమా ఆమె కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని భావించవచ్చు.
రాజ్కుమార్ హిరాని దర్శకత్వంలో ఆయన సొంత బ్యానర్ రాజ్కుమార్ హిరాని ఫిలిమ్స్, జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ కలిసి ‘డుంకి’ని నిర్మించబోతున్నాయి. ఇటీవలే ముంబైలో తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. త్వరలో తాప్సీ పన్ను కూడా షూటింగ్లో పాల్గొనబోతోంది.