Taapsee Pannuసాధారణంగా సినీ ఇండస్ట్రీలో ‘రెమ్యునరేషన్’ అనేది పెద్ద సీక్రెట్. సినిమా తారలు తమ పారితోషికాల వివరాలు వెల్లడించడానికి నిరాకరిస్తారు. చెప్పిన తర్వాత నుండి ఐటీ వాళ్లతో లేనిపోని తలనొప్పులు వస్తాయని ఆ పారితోషికాల విషయాలు చెప్పరు. అయితే, తాజాగా సొట్టబుగ్గల చిన్నది తాప్సీ మాత్రం ‘ఆనందో బ్రహ్మ’ సినిమాకి కోటి రూపాయలు తీసుకున్నానని చెప్పేసింది.

“ఆ కథకి నేనే కావాలని చెప్పి, నా కోసం ఏడాది పాటు ఆ చిత్రం యూనిట్ ఎదురుచూసింది. అందుకే, కాదనలేక ఆ సినిమా చేశాను. పైగా నాకు ఎంతో గౌరవం కూడా ఇచ్చారు. అంతేకాదు, ఆ సినిమా లాభాల నుంచి కోటి రూపాయలు కూడా ఇచ్చారు” అని చెప్పింది తాప్సీ. ఆర్టిస్టుగా తనకు గౌరవం ఇచ్చే వారితోనూ, తన పాత్రకు ప్రాధాన్యత ఇచ్చేవారితోను నటించడానికి తాను ఇష్టపడతానని తాప్సీ చెప్పింది.

గతంలో ఓ తెలుగు సినిమా విషయంలో ఎదురైన చేదు అనుభవమే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని ఆమె చెప్పింది. ‘నాకు ముందుగా కథ చెప్పినప్పుడు ఆ సినిమాలో నా ఇంట్రడక్షన్ సీన్ వేరేలా వుంది. తీరా షూటింగుకి వెళ్లాక మరోలా తీశారు. ఇదేమిటని దర్శకుడిని అడిగితే, హీరో మార్చమన్నారని, దీంతో మనకు గౌరవం, విలువ ఇచ్చే వాళ్లతోనే పనిచేయాలని అప్పుడే నిర్ణయించుకున్నానని’ చెప్పుకొచ్చింది.