ఒక అనుభవజ్ఞుడైన రాజకీయ వేత్తగానే కాకుండా, సినీ రంగంలో కూడా తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి పేరు ప్రముఖంగా వినపడుతుంటుంది. ‘టిఎస్సార్’ అవార్డుల పేరుతో సినీ, బుల్లితెర రంగంలో అవార్డులు అందిస్తున్న చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒక రాజకీయ నాయకుడిగా ఉన్న సుబ్బిరామిరెడ్డి, ఈ అవార్డులను ఎందుకు బహుకరిస్తారు? కేవలం పొగడ్తల కోసమేనా? అదే నిజమైతే పొగడ్తల కోసం కోట్ల రూపాయలను ఖర్చు పెట్టేస్తారా? ఇదే ప్రశ్నలను ప్రముఖ మీడియా ప్రతినిధి ఓ కార్యక్రమంలో సుబ్బిరామిరెడ్డిని ప్రశ్నించారు.
వేరే రాజకీయ నాయుకుడు అయితే ఇలాంటి స్ట్రెయిట్ ప్రశ్నలకు కాస్త అసహనం వ్యక్తం చేసేవారేమో గానీ, సుబ్బిరామిరెడ్డి తన అనుభవంతో సమాధానం ఇచ్చారు. ‘పొగడ్తలు అంటే ఎవరికీ ఇష్టం ఉండదు? నువ్వు బాగా చేస్తున్నావయ్యా అంటే నీకు ఇష్టం ఉండదా..? కొందరు నాకు పొగడ్తలు అంటే ఇష్టం ఉండదు అని అబద్ధాలు చెప్తుంటారు. కానీ, నేను అలా కాదు. అయితే నేను ఇస్తున్న అవార్డుల వలన ఎంతమంది సంతోషంగా ఉంటారో మీకు తెలిసిందే. నాకు తెలిసినంత వరకు అదే నాకు ముఖ్యం’ అంటూ అనుభవమైన సమాధానం వెలిబుచ్చారు.
ఇక, జగన్ ను – స్వరూపానంద స్వామిజీని కలిపింది మీరేనన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో ఉందన్న ప్రశ్నకు స్పందించిన తిక్కవరపు.., విశాఖపట్నంలో స్వామిజీని కలవడానికి జగన్ వస్తున్న విషయం తనకు అస్సలు తెలియదని, సాధారణంగా తానూ ధ్యానం చేసుకోవడానికి వెళ్తుంటానని, మేమిద్దరం అక్కడ కలవడం అనేది కాకతాళీయమేనని, అయినా ఆ రోజు మేము చర్చించుకున్నట్లుగా వచ్చిన వార్తల్లో నిజం లేదని, ప్రతినమస్కారాలు చేసుకోవడం తప్ప, మేము ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు.