Sye Raa Narasimha Reddy -release in 2020మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. నయనతార, తమన్నా కథానాయికలు. అమితాబ్‌బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి చిరంజీవి తనయుడు రామ్‌ చరణ్‌ నిర్మాత. ఈ చిత్రాన్ని మొదట ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్నారు. ఆ తరవాత వేసవి వైపు దృష్టి మళ్లింది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ ఈ సినిమా దసరాకు పోస్టుపోన్ అయ్యిందని చెప్పారు.

అయితే ఇప్పుడు మరి కొన్ని వార్తలు మెగా అభిమానులను కలవరానికి గురి చేస్తున్నాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం దసరా రిలీజ్ కి తగ్గట్టుగా చిత్రీకరణ జరగడం లేదట. దీనితో ఈ చిత్రం ఏకంగా వచ్చే సంక్రాంతికి వాయిదా పడొచ్చు అని తెలుస్తుంది. ఇదే జరిగితే 2020కి సినిమా వెళ్ళిపోయినట్టే. అంటే ఖైదీ నెం 150 రిలీజ్ తరువాత మూడు సంవత్సరాలకు చిరంజీవి సినిమా వస్తున్నట్టు. ఆలస్యం కారణంగా సినిమా బడ్జెట్ కూడా భారీగా పెరిగినట్టు తెలుస్తుంది.

దీనితో మెగా అభిమానులు ఆందోళనకు గురి అవుతున్నారు. సైరా చిత్రంలో జగపతిబాబు, విజయ్‌సేతుపతి కీలక పాత్రల్లో కనిపిస్తారు. మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక కూడా ఓ పాత్రలో తళుక్కున మెరవబోతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ సినిమాలో నటించడం వల్ల సినిమాకు ఉత్తరాదిన కూడా హైప్ వస్తుందని మెగా కుటుంబం ఆశాభావంగా ఉంది. చూడాలి ఏం జరగబోతుందో!