మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ క్రేజీ కాంబో మూవీ ముహూర్తం కాసేపటి క్రితం విజయదశమి సందర్భంగా జరిగింది. హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీతో పాటు దర్శకుడు కొరటాల తదితరులు పాల్గొన్నారు. మెగా మదర్ అంజనమ్మ కూడా హాజరు కావడం విశేషం. ముహూర్తం షాట్ కు చిరంజీవి సతీమణి సురేఖ క్లాప్ కొట్టారు.
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై రామ్ చరణ్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్కు తిరు సినిమాటోగ్రాఫర్గా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్గా పనిచేయనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే మిర్చి సినిమాతో టాలీవుడ్లో డైరక్టర్గా ప్రస్థానాన్ని ప్రారంభించిన కొరటాల.. వరుసగా నాలుగు హిట్లతో టాప్ డైరక్టర్ల లిస్ట్లో చేరిపోయాడు.
ఆయన ప్రతీ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ నే సంగీతం సమకూరుస్తున్నారు. అయితే ఈ మధ్య ఈ సినిమాకు వేరే సంగీత దర్శకుడిని తీసుకున్నారనే వార్తలు వచ్చాయి. బాలీవుడ్ సంగీత దర్శకులు అజయ్ అతుల్ స్వరాలు సమకూరుస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సంగీత దర్శకుడి పేరు ప్రకటించకపోవడం విశేషం.
తరువాత ప్రకటిస్తారేమో చూడాలి. ఈ సినిమాను ఉగాది సందర్భంగా విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అనేక పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ ఎవరిని అధికారికంగా ధ్రువీకరించలేదు. రెగ్యులర్ షూటింగ్ నవంబర్ మొదటి వారంలో మొదలు అవుతుందని సమాచారం.