చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత తెలుగు సినీ పరిశ్రమకు కొత్తేమీ కాదు. ఆమె కాస్ట్యూమ్ డిజైనర్గా కొన్ని చిరంజీవి చిత్రాలకు పనిచేశారు. ఇప్పుడు, ఆమె ప్రొడక్షన్ వైపు మొగ్గు చూపుతున్నారు. సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్’ నిర్మాణ సంస్థను నెలకొల్పారు.
ఆమె తన బ్యానర్లో వెబ్-సిరీస్ను కూడా ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు సంబంధించిన వివరాలను వెల్లడించాల్సి ఉంది. చిరంజీవి ఫ్యామిలీ నుండి వస్తున్న మొదటి డిజిటల్ ప్రాజెక్టు ఇది. 2009లో సిద్ధార్థ్, షామిలితో ఓయ్ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన ఆనంద్ రంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఓయ్ తరువాత ఆయన ఇంకో సినిమా చెయ్యలేదు.
ఇది ఆయన డిజిటల్ అరంగేట్రం. వాస్తవ ఘటనల ఆధారంగా టెర్రరిస్ట్ నేపథ్యంలో 8 ఎపిసోడ్స్తో కూడిన ఒక క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ప్రకటించారు. ఇందులో ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘జీ 5’ ఓటీటీలో ఈ సిరీస్ ఎక్స్క్లూజివ్గా స్ట్రీమింగ్ కానుంది.
హైదరాబాద్లోని ఓ పోలీస్, కొంతమంది కరుడుగట్టిన నేరస్తుల కథల ఆధారంగా వాస్తవ ఘటనల ప్రేరణతో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోందని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్లో అవసరమైన భద్రతా చర్యలతో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతోంది. ఈ వెబ్-సిరీస్ ఎప్పుడు బయటకు వస్తుందని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.