Suriya mass hero to message hero‘గజనీ’ సినిమా సక్సెస్ తో తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సూర్య, ఆ తర్వాత “సింగం” సినిమా వరుస సీక్వెల్స్ తో ‘మాస్’ హీరోగా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. సూర్య నటించిన ఇతర సినిమాలు అపజయాలు చవిచూశాయి గానీ, ‘సింగం’ సిరీస్ లో వచ్చిన మూడు సినిమాలు కమర్షియల్ గా మంచి విజయాన్ని అందించాయి.

‘మాస్’ హీరోగా ప్రేక్షకుల దృష్టిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న తర్వాత ఒక్కసారిగా తన రూట్ ను మార్చుకున్న సూర్యకు వరుసగా ఫెయిల్యూర్స్ పరిచయం అయ్యాయి. సూర్య సినిమాలు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కావడం ఎంత ఆనవాయితీగా మారాయో, అవి బాక్సాఫీస్ వద్ద తలక్రిందులు కావడం కూడా అంతే ఆనవాయితీగా మారిపోయాయి.

ఇక గడిచిన మూడు, నాలుగేళ్లల్లో సూర్య చేస్తోన్న సినిమాలను గమనిస్తే, సామాజిక అంశాలను స్పృశిస్తూ ప్రజలను మేలుకొలిపే సందేశాత్మక సినిమాలను చేస్తూ వస్తున్నారు. ఈ కోవలో మంచి కీర్తి ప్రతిష్టతలు అయితే వస్తున్నాయి గానీ, బాక్సాఫీస్ వద్ద ఫలితాలు మాత్రం మారడం లేదు. కరోనా పుణ్యమా అంటూ సిల్వర్ స్క్రీన్ కు దూరమై ఓటీటీలో సందడి చేసిన సూర్య ఎట్టకేలకు నేడు వెండితెర తలుపు తట్టారు.

“ఎవరికీ తలవంచడు” అంటూ మరోసారి సందేశాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు సూర్య. ఓ నటుడిగా సూర్య ఏమిటన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, గత చిత్రం “జై భీమ్” ఒక్కటి చాలు, సూర్య నటన కొలమానం ఏమిటన్నది చెప్పడానికి! అలాగే ‘ఎవరికీ తలవంచడు’ సినిమాకు కూడా సూర్య హైలైట్ అవుతారు గానీ, ఈ సినిమాతో సూర్యకు పెద్దగా ఒరిగేదేమి లేకపోవడం గమనించాలి.

మంచి కధలే అయినా ఒకే తరహా సబ్జెక్టులను ఎంపిక చేసుకున్న (శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి) మహేష్ బాబును సైతం ప్రేక్షకులు విమర్శించారు. అలాగే సూర్య ఏమి అందుకు మినహాయింపు కాదు. సామాజిక అంశాలతో కూడుకున్న కధలను ఎంపిక చేసుకుని సినిమాలు చేయడం మంచి విషయమే అయినా, వరుసగా అలాంటివే చేయడం విమర్శలకు తావిచ్చేవే.

అలాగే ఒక స్టార్ హీరోగా తనకున్న స్టార్ డంను నిలబెట్టుకోవడానికి అయినా మధ్య మధ్యలో కమర్షియల్ కోణంలో ఉన్న ‘సింగం’ లాంటి సినిమాలను సూర్య చేయాల్సి ఉంటుంది. లేదంటే ప్రస్తుతం ఉన్న క్రేజ్ ఎల్లకాలం కొనసాగదు. ‘మాస్’ హీరో నుండి ‘మెస్సేజ్’ను ఇచ్చే హీరోగా ఎదిగిన వైనం మంచిదే, కానీ ప్రతిసారి ‘మెస్సేజ్’ అంటే ప్రేక్షకులకు రుచించాలి కదా!