టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగూలీని ఊహించని అవకాశం ఊరిస్తోంది. లోథా కమిటీ సిఫారసుల నేపథ్యంలో, బీసీసీఐ ప్రస్తుత నాయకత్వానికి గండం పొంచి ఉన్న సంగతి తెలిసిందే. ఈ రోజు జరిగిన హియరింగ్ తర్వాత, తన తీర్పును రిజర్వ్ లో ఉంచింది సుప్రీంకోర్టు. ఒకవేళ, ప్రస్తుత బోర్డు కార్యవర్గం దిగిపోవాలని సుప్రీం తీర్పును వెలువరిస్తే…. బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా గంగూలీకి అవకాశం దక్కే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది.

అంతర్జాతీయ క్రికెట్ లో అపార అనుభవం ఉండటమే కాక, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ను సమర్థవంతంగా నడిపిస్తుండటం గంగూలీకి బాగా కలసివచ్చే అంశం. భారత క్రికెట్ ను మ్యాచ్ ఫిక్సింగ్ కుదిపేస్తున్నప్పుడు జట్టు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన గంగూలీ… మచ్చలేని సారథిగా పేరు తెచ్చుకున్నాడు. దాదాను అప్రోచ్ అయ్యే దమ్ము ఎవరికీ లేదంటూ ఓ బుకీ ఆన్ రికార్డ్ చెప్పడం గూంగూలీ గొప్పదనమేంటో తెలుపుతుంది. ఈ పరిస్థితుల్లో ఏదైనా జరిగితే… గంగూలీ ఇండియన్ క్రికెట్ బాస్ గా పదవి చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే, బీసీసీఐ ప్రక్షాళన కోసం లోథా కమిటీ చేసిన ప్రతిపాదనలను బీసీసీఐ పెడచెవిన పెట్టిన వైనంపై తాజాగా మ‌రోసారి న్యాయ‌స్థానం మండిప‌డింది. ధిక్కారణ ధోరణితో బీసీసీఐ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేయగా, లోథా క‌మిటీ సిఫార్సుల‌ను అమ‌లు ప‌ర్చ‌డానికి త‌మ‌కు మ‌రింత స‌మ‌యం కావాల‌ని బోర్డు తరఫు లాయర్ కపిల్ సిబల్ న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. అయితే, ఈ అంశంపై తీర్పును ఎప్పుడు వెల్లడిస్తామనే విషయాన్ని న్యాయస్థానం తెలపలేదు.