నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో స్టే ఇచ్చేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది..? గవర్నర్ ఆదేశాలు ఇచ్చినా ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గవర్నర్ సలహాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? అని జగన్ సర్కార్పై సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది.
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరిగి నియమించడానికి వచ్చే శుక్రవారం వరకూ టైం ఇచ్చింది. ఈ మొత్తం ఇష్యూ ప్రభుత్వానికి తలవంపులు తెచ్చి పెట్టింది అనే చెప్పుకోవాలి. కరోనా కారణంగా స్థానిక ఎన్నికలు వాయిదా వెయ్యడం ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. కరోనా పట్ల సరైన అవగాహన లేకపోవడం, రమేష్ కుమార్ సామాజిక వర్గం కారణంగా ఏకంగా ముఖ్యమంత్రి జగన్ తన స్థాయిని మరచి మీడియా ముందుకు వచ్చి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో చివరి అంకం కంటే ఆ ప్రెస్ మీట్ పెట్టడమే పెద్ద పతనావస్థ అని చెప్పుకోవాలి.
ఆ తరువాత హై కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు రాకపోవడంతో ప్రభుత్వంలోని వారు న్యాయమూర్తుల మీద తీవ్ర విమర్శలు చేయించడం, తమ సోషల్ మీడియా టీమ్ తో చేయించడం మరీ దారుణం. తాము గెలిచే పరిస్థితి లేదు అని తెలిసినా ఒకే అంశంపై నాలుగు సార్లు సుప్రీంలో స్టే అడగడం, గవర్నర్ ఆదేశాలను పక్కన పెట్టడం వంటివి తెచ్చి పెట్టుకున్న తలవంపులే అని చెప్పుకోవాలి.
ఒకవేళ రమేష్ కుమార్ అని సాగనంపాలి అనుకున్నా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి డైరెక్టుగా రంగంలోకి దిగడం వ్యూహాత్మక తప్పిదం అని చెప్పుకోవాలి. కోట్లు ఖర్చు పెట్టి పెట్టుకున్న సలహాదారులు గానీ, లాయర్లు గానీ ప్రభుత్వానికి సరైన సలహాలు ఇవ్వడం లేదా లేక ఇచ్చినా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదా అని అనిపించకమానదు. తన కోపమే తన శత్రువు అని జగన్ ఇప్పటికైనా తెలుసుకుంటారా?