“దేశంలో ఇంతటి తీవ్ర వర్షాభావం, కరవు పరిస్థితులు నెలకొంటే మీరు చేస్తున్నదేంటి? రాష్ట్రాలను ముందస్తుగానే హెచ్చరించాల్సిన బాధ్యత మీకు లేదా?” అంటూ సుప్రీంకోర్టు మోడీ సర్కారును ప్రశ్నించింది. తక్కువ వర్షపాతం ఎక్కడ నమోదవుతుందో ముందే తెలుసుకుని కేంద్రమే, ఆయా రాష్ట్రాలను హెచ్చరించాల్సి వుందని అభిప్రాయపడింది. “ఒక ప్రాంతంలో 96 శాతం దిగుబడి వస్తుందని అంచనా వేస్తే, ఆపై వర్షాలు తక్కువగా కురుస్తాయన్న సమాచారం మీకందితే, దాన్ని రాష్ట్రాలకు చేరవేసి ఎందుకు హెచ్చరించడం లేదు?” అని జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు.
అంతకుముందు అదనపు సొలిసిటర్ జనరల్, తన అఫిడవిట్ ను సమర్పిస్తూ, 10 రాష్ట్రాల్లోని 256 జిల్లాలను కరవు పీడిత ప్రాంతాలుగా గుర్తించినట్టు తెలిపారు. ఓ ప్రాంతం కరవు బారిన పడిందంటే, అక్కడ నివసించే అందరిపై ప్రభావం ఉంటుందని కాదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా, కోర్టు ఆ వాదనను వ్యతిరేకించింది.
ఇదే సమయంలో కరవుపై గుజరాత్ తీరునూ గర్హించింది. కరవుపై కోర్టు కోరిన విధంగా అఫిడవిట్ సమర్పించడంలో విఫలమవడాన్ని తప్పుపడుతూ, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే, చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది.