SSMB28 Pooja Cermonyసూపర్ స్టార్ మహేష్ బాబు… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్… ఈ కాంబో కోసం మహేష్ అభిమానులే కాదు, సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కలయికలో రెండు సినిమాలు విడుదలయ్యాయి. బాక్సాఫీస్ ఫలితాలతో నిమిత్తం లేకుండా ఆ రెండూ కూడా క్లాసిక్స్ గా నిలిచిపోయాయి.

2005లో అతడు… 2010లో ఖలేజా… మళ్ళీ వీరిద్దరూ కలవడానికి దాదాపుగా ఒక పుష్కరం దాటిపోయింది. గత నాలుగైదుళ్ళుగా మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా వస్తుందని బలంగా ప్రచారం జరిగినప్పటికీ, సెట్స్ పైకి మాత్రం వెళ్ళలేదు. ఈ వాయిదాలతో మహేష్ అభిమానులు ఎంతో నిరుత్సాహం వ్యక్తం చేసారు.

అయితే ఎట్టకేలకు ఇవాళ పూజా కార్యక్రమాలు జరుపుకోవడంతో అభిమానులకు ఉపశమనం కలిగింది. యధావిధిగా ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి మహేష్ దూరంగా ఉన్నారు. ప్రతి సినిమా ఓపెనింగ్ కు హాజరు కాకపోవడం అనేది సూపర్ స్టార్ కు ఓ సెంటిమెంట్ అన్న విషయం తెలిసిందే. మొత్తానికి ఓపెనింగ్ అయితే చేసుకుంది గానీ, ఈ సారైనా బాక్సాఫీస్ వద్ద వీరిద్దరి మ్యాజిక్ వర్కౌట్ అవుతుందా? అన్న ప్రశ్న మాత్రం అభిమానులను వేధిస్తోంది.

ఎందుకంటే “అతడు” సినిమా అందరికి నచ్చింది గానీ, బాక్సాఫీస్ వద్ద కనకవర్షం అయితే కురిపించలేక పోయింది. అవార్డులను సైతం తీసుకువచ్చిన ఈ సినిమా మహేష్ – త్రివిక్రమ్ కెరీర్ లో ‘క్లాసిక్’గా మిగిలిపోయిందని చెప్పడంలో సందేహం లేదు గానీ, అవ్వాల్సినంత ‘బ్లాక్ బస్టర్’ మాత్రం అవ్వలేదన్న అసంతృప్తి అభిమానుల్లో నెలకొంది.

ఇక ఖలేజా… మహేష్ లోని కామెడీ కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా. ధియేటర్ లో సినిమా చూసినంత సేపు నవ్వుకున్న ప్రేక్షకులు, బయటకు వచ్చాక మాత్రం పెదవి విరిచారు. కాలం కలిసి రాకపోతే రిజల్ట్ ఎలా ఉంటుందో అనే దానికి “ఖలేజా” ఒక ఉదాహరణ. అప్పటికి ఇప్పటికి 12 ఏళ్ళు గడిచాయి.

మరి ఈ సారి మహేష్ లోని ఏ కోణాన్ని త్రివిక్రమ్ ప్రేక్షకులకు పరిచయం చేస్తారోనని సూపర్ స్టార్ అభిమానులు వేచిచూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ‘మహర్షి’ ఫేమ్ పూజా హెగ్డే నటిస్తుండగా, థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్ లో తొలిసారిగా మహేష్ బాబు నటిస్తున్నారు.